చంద్ర‌బాబు నామినేష‌న్‌.. హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైమ్ ఇలా !

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌రుస‌గా 8వ సారి ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భ‌వించిన 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 1983 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న ఎన్‌. రంగ‌స్వామి నాయుడు.. తొలిసారి టీడీపీ జెండాపై పోటీ చేశారు. ఆయ‌న భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. జ‌రిగిన 1985 ఎన్నిక ల్లోనూ ఈయ‌న‌కే అన్న‌గారు అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా నాయుడు విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇలా మొద‌లైన టీడీపీ ప్ర‌స్థానం.. ఇక‌, 1989 ఎన్నిక‌ల నుంచి కుప్పంలో అస‌లు తిరుగే లేద‌న్న‌ట్టుగా ముందుకు సాగింది. అప్ప‌టి నుంచి 2019 వ‌ర‌కు 7 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఈ ఏడు సార్లు(1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019) చంద్ర‌బాబు ఘ‌న విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు ఎనిమిదోసారి కూడా చంద్ర‌బాబు ఇక్క‌డ నుంచి నామినేష‌న్ వేస్తున్నారు. అయితే.. గ‌త ఏడు సార్ల‌కు భిన్నంగా ఈ సారి ప్ర‌త్యే క చోటు చేసుకుంది. ప్ర‌తి ఎన్నిక‌లోనూ చంద్ర‌బాబు నేరుగా నామినేష‌న్లు వేస్తున్నారు.

అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కుప్పంలో నామినేష‌న్ వేశారు. అంతే కాదు.. ఎప్పుడూ లేని విధంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో పత్రాలను ఉంచి భువనేశ్వరి పూజలు చేశారు. అనంతరం అవే ప‌త్రాల‌ను లక్ష్మీపురంలో ఉన్న మసీదులోనూ ఉంచి.. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లోనూ ఆమె పాల్గొన్నారు. అంతేకాదు.. మ‌రికొంత దూరంలోని బాబూనగర్ లో ఉన్న చర్చికి తీసుకువెళ్లి.. ప్ర‌త్యేక ప్రార్థనలు చేయించారు.

ఇలా చేయ‌డం ఈ 7 ద‌ఫాల్లో ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు..చంద్ర‌బాబు త‌ర‌ఫున గ‌తంలో స్థానిక నాయ‌కులు నామినేష‌న్‌లు వేయ‌గా.. ఈ సారి భువ‌నేశ్వ‌రి నేరుగా రంగంలోకి దిగారు. మొత్తానికి కుప్పంపై ప్ర‌త్య‌క శ్ర‌ద్ధే పెట్టిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.