నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్.. నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్..

సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా….సింపతీ పొందేందుకు ఇలా చేయాల్సిన అవసరం జగన్ కు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది డ్రామా కాదని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ, ఆ రాయో ఏదో వచ్చిందో అక్కడ ఉండాలి కదా… ఆ వస్తువు ఉండాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పడిన రాయి మాయమైపోతుందా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. కోడి..గుడ్డు…కోడి పిల్ల అంటూ పాత రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లని..అదే మాదిరిగా జగన్ పై రాయి కూడా లేటెస్ట్ మ్యాజిక్ అని సెటైర్లు వేశారు. ‘‘జగన్ వచ్చాడు..కరెంట్ ఆఫ్ అయిందట…దానికి నేను బాధ్యుడినట..నీదా నాదా ప్రభుత్వం…నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్..నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్…’’అని మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

చంద్రబాబుకే కాదు సగటు మనిషికి కూడా ఈ డౌట్ వస్తోంది. పడిన రాయి ఏమైంది…కేట్ బాల్ అని కొందరు….పిల్లెట్ గన్ అని కొందరు అంటున్నారు. పోలీసులేమో చేతితో రాయి విసిరారు అని చెబుతున్నారు. ఇలా తలో మాట చెప్పడంతో ఇది డ్రామా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఇక, ఇంత టెక్నాలజీ ఉన్నాకూడా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరగడం సందేహాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.