దిద్దుకోలేనంత‌గా క‌విత ఎఫ్‌క్ట్‌!

గ‌త తెలంగాణ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఢీలా ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌తో చెల‌రేగుతూ.. వివిధ విభాగాల్లో కేసులు పెడుతూ బీఆర్ఎస్‌ను దెబ్బ‌కొడుతోంద‌ని చెప్పాలి. ఇక ఇప్పుడు క‌విత అరెస్టు విష‌యం దెబ్బ మీద కారంలా కేసీఆర్‌కు మంట పెడుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో క‌విత‌ను ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని మేనేజ్ చెయ్య‌లేక బీఆర్ఎస్ నేత‌లు త‌ల ప‌ట్టుకుంటున్నారు. ఇప్పుడిక ఈ విష‌యంలో సీబీఐ ఎంట‌రై క‌విత‌ను అరెస్టు చేసింది. దీంతో కేసీఆర్‌కు మ‌రింత త‌ల‌నొప్పి త‌ప్పేలా లేద‌నే చెప్పాలి.

లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత‌ను అరెస్టు చేసిన సీబీఐ తాజాగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ స్కామ్‌లో క‌విత సూత్ర‌ధారి అని ఈ సంద‌ర్భంగా సీబీఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ, హైద‌రాబాద్‌లో ఈ స్కామ్‌కు స్కెచ్ వేసిన‌ట్లు, రూ.100 కోట్లు స‌మీక‌రించి ఆప్ నేత‌ల‌కు ఇచ్చిన‌ట్లు సీబీఐ ఆరోపించింది. విచార‌ణ కోసం అయిదు రోజుల కస్ట‌డీకి క‌విత‌ను ఇవ్వాల‌ని కోరింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మార్చి 15న క‌విత‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో ఆమెను తీహార్ జైలుకు త‌ర‌లించారు. అక్క‌డే క‌విత‌ను సీబీఐ అరెస్టు చేసింది.

ఈ ప‌రిణామంతో బీఆర్ఎస్ నేత‌లు మ‌రింత షాక్‌కు గురి అయ్యారు. ఇప్ప‌టికే క‌విత అరెస్టు పార్టీకి డ్యామేజీ చేస్తుంద‌ని.. ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగ‌డంతో మ‌రింత అప్ర‌తిష్ఠ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ క‌విత జైలులోనే ఉంటే అది బీఆర్ఎస్‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులే అనుకుంటున్నారు. ఇక క‌విత అరెస్టుపై కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం కూడా పార్టీకి చేటు చేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క‌మ‌వుతున్నాయి. ఇప్పుడు స‌రిదిద్దుకోలేనంత‌గా క‌విత ఎఫెక్ట్ పార్టీపై ప‌డుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్‌కు క‌ష్ట కాలం కొన‌సాగుతుంద‌నే చెప్పాలి.