అప్పుడు ఎవ‌ర‌న్నారు? ఇప్పుడు మా సీఎం అంటున్నారు

అధికారం ఎంత చిత్ర‌మైందో! అప్పుడే మిత్రులను శ‌త్రువులుగా మార్చేస్తుంది. బ‌ద్ద శ‌త్రువులును ప్రాణ మిత్రులుగా చేస్తుంది. ఇప్పుడీ విష‌యం ఎందుకంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల వైఖ‌రిలో వ‌చ్చిన మార్పును చెప్పేందుకే. ఒక‌ప్పుడు రేవంత్ ఎవ‌రు? అని ప్ర‌శ్నించిన నోళ్లే.. ఇప్పుడు రేవంతే మా సీఎం.. ఆయ‌న ఇంకా ప‌దేళ్లు ఆ ప‌ద‌విలో ఉంటార‌ని చెబుతున్నాయి. అవును.. ఇదే నిజం. అధికారం తెచ్చిన మార్పు ఇది అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్‌ను ఉద్దేశించి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. కానీ ఈ సారి నెగెటివ్ కాదు చాలా చాలా పాజిటివ్‌గా కోమ‌టిరెడ్డి మాటలుండ‌టం గ‌మ‌నార్హం. రంజాన్ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన కోమ‌టిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ద‌మ్ము ఎవ‌రికీ లేద‌ని, కాంగ్రెస్ ప‌దేళ్లు అధికారంలో ఉంటుద‌ని ఆయ‌న‌న్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డే త‌మ సీఎం అని స్ప‌ష్టం చేశారు. తామంతా ఒక్క‌టిగానే క‌లిసి ఉన్నామ‌ని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ నాయ‌కుల మ‌ధ్య విభేదాలు పెట్ట‌డానికి బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌య‌త్నస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి విమ‌ర్శించారు.

ఇప్పుడు తామంతా ఒక‌టేన‌ని చెబుతున్న కోమ‌టిరెడ్డి గ‌తంలో రేవంత్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కాన్ని ఖండించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల్లో కోమ‌టిరెడ్డి కూడా ఒక‌రు. అసలు రేవంత్ ఎవ‌ర‌ని, బ‌య‌ట నుంచి వచ్చిన వ్య‌క్తికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని అప్పుడు ప్ర‌శ్నించారు. రేవంత్ రూ.కోట్లు చెల్లించి మ‌రీ ఈ ప‌ద‌వి ప‌ట్టార‌నే ఆరోప‌ణ‌లు చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సీఎం ప‌ద‌విపై కోమ‌టిరెడ్డి ఆశ‌ప‌డ్డారు. కానీ రేవంత్‌నే అధిష్ఠానం సీఎంగా ప్ర‌క‌టించ‌డంతో మంత్రి ప‌ద‌వితో సంతృప్తి చెందారు. మ‌రోవైపు త‌న‌ను వ్య‌తిరేకించిన సీనియ‌ర్ల‌ను త‌న‌వైపు మ‌ళ్లించుకోవ‌డంలో రేవంత్ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇప్పుడు సీనియ‌ర్లు ఒక్కొక్క‌రిగా రేవంత్ పాల‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ తామంతా ఒక్క‌టేన‌ని చాటుతున్నారు.