ప‌వ‌న్ కల్యాణ్ హామీ.. న‌మ్మితే తిరుగులేదు!

ఎన్నిక‌ల వేళ అన్ని రాజ‌కీయ పార్టీలూ బ‌ల‌మైన హామీలతోనే ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. అయితే.. వీటిని న‌మ్మించ‌డంలోనే అస‌లు స‌మ‌స్య ఉంటుంది. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను దాటి కొంత కృషి చేస్తే.. తాజాగా జ‌న‌సేన ఇచ్చిన హామీ నిజ‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగిస్తే.. కూట‌మి క‌ల‌లు కంటున్న అధికారం చేరువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లుగా కీల‌క‌మైన స‌మ‌స్య వెంటాడుతోంది. అది రాష్ట్రంలోని 2 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన స‌మ‌స్య కావ‌డం గ‌మ‌నార్హం. అదే సీపీఎస్‌. కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్‌గా పిలిచే దీనిని ర‌ద్దు చేయాల‌న్న‌ది ఉద్యోగుల డిమాండ్‌.

దీనివ‌ల్ల త‌మ ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లుగుతుంద‌ని ఉద్యోగులు దేశ‌వ్యాప్తంగా డిమాండ్ చేశారు. అయితే.. 2009లో తీసుకువ‌చ్చి న ఈ విధానం ఇప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లో అమ‌ల‌వుతూనే ఉంది. వీటిలో ఏపీ ఒక‌టి. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వారం రోజుల్లోనే దీనిని ఎత్తేస్తామ‌న్నారు. అదేవిధంగా ఉద్యోగులు కోరుతున్న ఓల్డ్ పింఛ‌న్ స్కీమ్‌(ఓపీఎస్‌)ను అమ‌లు చేస్తామ‌న్నారు. దీంతో ఉద్యోగులు అంద‌రూ జ‌గ‌న్‌కు జై కొట్టారు. దాదాపు 5 ల‌క్ష‌ల ఓటు బ్యాంకు ఉన్న ఉద్యోగులు(వారి కుటుంబాల‌తో క‌లిపి) వైసీపీకి అనుకూలంగా ఓటెత్తార‌ని ఒక అంచ‌నా.

అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఐదేళ్లు అయిపోయినా.. ఈ హామీని ఆయ‌న అమ‌లు చేయ‌లేక‌పోయారు. దీనిపై ఉద్యో గులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సంద‌ర్భాల్లో దండెత్తారు. విజ‌య‌వాడ భారీ మార్చ్‌(మిలియ‌న్‌) కూడా చేశారు. అరెస్టు అయ్యారు. కేసుల‌కు కూడా వెనుకాడ‌లేదు. కానీ, ప్ర‌భుత్వం మాత్రం ఈ హామీని అమ‌లు చేయ‌లేక‌పోయింది. పైగా.. స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(స‌ల‌హాదారు) వంటి కీల‌క నాయ‌కులు.. జ‌గ‌న్‌కు తెలియ‌క ఇలాంటి హామీ ఇచ్చార‌ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసి.. మ‌రింత ఇర‌కాటంలో కూరుకుపోయారు. అయినా ఉద్యోగులు వ‌దిలి పెట్ట‌కుండా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో జీపీఎస్ అంటూ.. ప్ర‌భుత్వం మ‌రో పింఛ‌ను స్కీమ్‌ను తీసుకువ‌చ్చింది.

ఇది గ్యారెంటీ పింఛ‌ను ప‌థకం(జీపీఎస్‌). దీనివ‌ల్ల‌మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు న‌చ్చజెప్పే ప్ర‌య‌త్నం చేసింది. కానీ… దీనికి కూడా ఉద్యోగులు స‌మ్మ‌తించ‌లేదు. ఈలోగా ఎన్నిక‌ల ఏడాది వ‌చ్చేసింది. అంతేకాదు.. ఉద్యోగుల మ‌ధ్య చీలిక‌లు పెట్టిన ప్ర‌భుత్వ పెద్ద‌లు.. మొత్తంగా సీపీఎస్ డిమాండ్‌ను అయితే.. తొక్కి పెట్టారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మ‌రోసారి సీపీఎస్‌ను ప్ర‌స్తావించారు. ఇప్పుడు ఆయ‌న రెండోసారి చాలా బ‌లంగా చెప్పుకొచ్చారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సీపీఎస్ ర‌ద్దు చేసేలా చంద్ర‌బాబును కోరతాన‌ని.. నిడ‌ద‌వోలు స‌భ‌లో చెప్పుకొచ్చారు.

అయితే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీనికి మూల‌కార‌ణం కేంద్రంలోనే ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అయితే..ఇప్పుడు అదే కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఆ పార్టీని క‌నుక ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తూ.. ఉద్యోగుల్లో క‌నుక ధైర్యం నింప‌గ‌లిగితే.. ప‌వ‌న్‌పై విశ్వాసం ఏర్ప‌డుతుంది. త‌ద్వారా.. ఉద్యోగుల ఓట్లు దాదాపు 5 ల‌క్ష‌ల పైచిలుకు కూట‌మికి ప‌డే అవ‌కాశంఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఇదేమంత ఈజీ కాదు. ఈ నెల రోజుల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఉద్యోగుల మ‌న‌సులో బ‌ల‌మైన పునాదులు వేయ‌గ‌లిగే ప్ర‌యత్నాలు చేయ‌గ‌లిగిన‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంద‌నేది జ‌న‌సేనాని తెలుసుకోవాలి.