సెమీస్ కు చేరనున్న ట్యాపింగ్ కేసు

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో స్థాయికి వెళ్లనుందా? ఇప్పటివరకు ట్యాపింగ్ అనుమానితులుగా పోలీసు అధికారుల్ని అదుపులోకి తీసుకోవటం.. వారిని విచారించటం.. రిమాండ్ కు తరలించటం లాంటి పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. సాదాసీదా అధికారి స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయి అధికారి వరకు ట్యాపింగ్ వ్యవహారంలో అంటకాగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ఒక మాజీ మంత్రికి కూడా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇస్తారన్న వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా.. వారికి సన్నిహితంగా ఉండే గులాబీ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం గులాబీ పార్టీలో గుబులు పుట్టించేలా మారింది. కేసీఆర్ సర్కారులో టాస్క్ ఫోర్సుకు ఓఎస్డీగా వ్యవహరించిన రాధాకిషన్ రావు కస్టడీలో బయటకు వచ్చిన అంశాల ఆధారంగానే సదరు ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు.. తిరపతన్న విచారణలోనూ హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక ఎమ్మెల్సీ పేరు వెలుగులోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన పేరునే రాధాకిషన్ రావు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. టార్గెట్ చేసుకున్న వ్యక్తుల ఫోన్లు.. ఎలక్ట్రానిక్ డివైజ్ లను వారి నివాసానికి 300 మీటర్ల దూరం నుంచే ట్యాప్ చేసే పరికరాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే.

సదరు పరికరాన్ని కొనుగోలు చేయటానికి సదరు ఎమ్మెల్సీనే నిధులు సమకూర్చినట్లుగా చెబుతున్నారు. నిధులు సమకూర్చినట్లుగా ఆధారాల్ని పోలీసులు సేకరించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ తీరులో ఉండనుందన్న విషయం తుక్కుగూడలో నిర్వహించిన సభలోనూ స్పష్టమైంది. ట్యాపింగ్ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించటమే కాదు.. ఈ అంశంపై ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో ట్యాపింగ్ విచారణ తర్వాతి దశలోకి వెళ్లటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా వినిపిస్తున్నట్లుగా గులాబీ ఎమ్మెల్సీకి ట్యాపింగ్ వ్యవహారంపై నోటీసులు ఇస్తే మాత్రం.. తదుపరి చర్యలు వేగంగా ముందుకు వెళతాయని చెబుతున్నారు. సదరు ఎమ్మెల్సీని విచారణకు నోటీసులు ఇస్తే.. ఆ తర్వాత ఆ జాబితాలో వచ్చే పేర్లు పెను రాజకీయ సంచలనానికి తెర తీయటం ఖాయమంటున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మరింత హాట్ గా మారుస్తుందనటంలో సందేహం లేదనే చెప్పాలి.