చంద్ర‌బాబు సీఎం అయిపోయారా? : త‌మ్ముళ్ల టాక్‌!

చిత్ర‌మేమీ కాదు. ఇప్పుడు ఇదే మాట టీడీపీ నాయ‌కుల మ‌ధ్య వినిపిస్తోంది. చంద్ర‌బాబు అప్పుడే సీఎం అయిపోయారా? అని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ చేయాల్సిన ప‌నుల‌ను ఆయ‌న చేస్తుండ‌డ‌మే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో పేద‌ల‌కు, వృధ్దుల‌కు వికలాంగుల‌కు అందాల్సిన సామాజిక పింఛ‌ను ఆల‌స్యం అవుతుంద‌నే ఆందోళ‌న ఆయా వ‌ర్గాల్లో వినిపి స్తోంది. నిజానికి సీఎంగా ఉన్న జ‌గ‌న్ ఇలాంటి స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉండాలి.

ఆవేద‌న‌, ఆందోళ‌న‌లో ఉన్న ఆయా వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ, ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. దీంతో చంద్ర‌బాబే ఈ బాధ్య‌త‌లు త‌న భుజాన వేసుకున్నారు. పింఛ‌న్ల‌ను ఇంటింటికీ పంపించేలా అధికారులు బాధ్య‌త తీసుకోవాలని, మూడో తేడీ నుంచి వారంలో పూర్తి చేయాల‌ని.. ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ‌ల‌పై లేఖ‌లు రాశారు. అదేస‌మ‌యంలో ఆయా సామాజిక పింఛ‌న్లు తీసుకునేవారిని ఊర‌డిస్తూ కూడా.. చంద్ర‌బాబు లేఖ‌లు సందించారు.

ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డం.. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కొంత జాప్యం జ‌రిగింద‌ని.. మూడో తేదీ నుంచి ఖ‌చ్చితంగా ఇంటింటికీ పింఛ‌ను అందుతుంద‌ని.. సామాజిక పింఛ‌ను అందుకునే లబ్ధి దారులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు సూచించారు. ఇలా.. త‌న‌దైన శైలిలో ఒక‌వైపు ప్ర‌చారం చేస్తూ.. మ‌రోవైపు.. ప్రభుత్వ యంత్రాంగానికి సూచ‌న‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఊర‌డిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానారికి కూడాచంద్ర‌బాబు లేఖ రాశారు.

సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని ఇప్పటికే సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు ఇవాళ ఎన్నికల అధికారి ఎంకే మీనాకు ఫోన్ చేశారు. పింఛన్ల పంపిణీలో సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే చంద్ర‌బాబు సీఎం అయిపోయారంటూ.. సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ తాను సీఎంగా ఉండి కూడా.. బాధ్య‌త‌లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. పెద‌వి విరుస్తున్నారు.