పెద్దిరెడ్డికి ఇద్ద‌రు మొగుళ్లు..

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తున్న వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఈ ద‌ఫా సెగ‌లు మామూలుగా త‌గ‌ల‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌నంత‌టి వాడు లేడ‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకున్నారు. ఇలానే నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పారు. కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. రాజంపేట నుంచి పార్ల‌మెంటు కు పోటీ చేస్తున్న కూట‌మి అభ్య‌ర్థి, బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి రైట్ నుంచి త‌గులుకున్నారు. ఇది పెద్ద మైన‌స్‌గా మార‌నుంది. రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఫీల్ గుడ్ నాయ‌కుడిగా పేరున్న కిర‌ణ్ కుమార్‌రెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతోంది.

పెద్దిరెడ్డి అంటే గిట్ట‌ని రెడ్డి నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్నారు.కానీ.. ఇప్పుడు కిర‌ణ్ ఎంట్రీతో ఆయ‌న‌కు వారు ద‌న్ను గా మారుతున్నారు. తాజాగా గ‌త రెండు రోజులుగా కిర‌ణ్ కుమార్‌రెడ్డి ఇక్క‌డే ప‌ర్య‌టిస్తున్నారు. త‌న వారిని క‌లుస్తున్నారు. మ‌ద్ద‌తు కోరుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి వ‌ర్గంలోని రెడ్డి నాయ‌కులుసైలెంట్‌గా కిర‌ణ్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నిజానికి పెద్దిరెడ్డిని ఇక్క‌డ రెడ్లు కొన్నాళ్లుగా దూరం పెడుతున్నారు. క‌నీసం త‌మ‌కు చిన్న చిన్న ప‌నులు కూడా ఇవ్వ‌కుండా పెద్ది రెడ్డి వ‌ర్గ‌మే అన్నీ చేస్తుండ‌డం.. క‌నీసం చేసిన ప‌నులు కూడా డ‌బ్బులు ఇప్పించ‌కుండా వేధించ‌డం ఆయ‌న‌కు మైన‌స్ అయింది.

ఇలాంటి బాధిత రెడ్లు అంద‌రూ కూడా.. ఇప్పుడు కిర‌ణ్‌కు అనుకూలంగా మారుతున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పెద్దిరెడ్డికుమారుడు మిథున్ రెడ్డి వ‌రుస‌గా పోటీ చేస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రెడ్డి వ‌ర్గం పోటెత్త‌నుంది. ఇక‌, మ‌రోవైపు.. బీసీ నాయ‌కుడు, యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన బోడే రామచంద్ర‌యాద‌వ్ పెద్దిరెడ్డికి లెఫ్ట్ సైడ్ త‌గులుకున్నారు. దీంతో ఈయ‌న కూడా.. పెద్దిరెడ్డికి భారీ సెగ పెడుతున్నారు. యాద‌వుల‌ను అణిచేస్తున్నారంటూ.. రెండేళ్లుగా పోరాటం చేస్తున్న ఆయ‌న‌.. సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది.

ప్ర‌స్తుతం ఆయ‌న స్థాపించిన భార‌త చైత‌న్య‌ యువ‌జ‌న పార్టీ త‌ర‌ఫున బోడే ప్ర‌చారం ఉద్రుతం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం త‌న గెలుపు మాత్ర‌మే కాదని.. పెద్దిరెడ్డి కుటుంబం ఓట‌మి ముఖ్య‌మని బోడే బ‌హిరంగంగానే చెబుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి ఇలాకా పుంగ‌నూరులో వేడి పెరిగింది. ఈ ఇద్ద‌రు ఇలా ఉంటే.. టీడీపీ నేత‌లు ఏక‌మ‌య్యారు. త‌మ‌పై గత రెండేళ్లుగా పెద్ది రెడ్డి చేస్తున్న దాడులుపెడుతున్న కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాయ‌కుడు.. టీడీపీ నుంచి కూట‌మి త‌ర‌ఫున బ‌రిలోకి దిగి రామ‌చంద్రారెడ్డికి వారు మ‌ద్ద‌తు చెబుతున్నారు. ఎక్క‌డా ఓటు చీల‌కుండా ప‌ల్లెప‌ల్లెలోనూ టీడీపీని గెలిపించాల‌ని కోరుతున్నారు. దీంతో పెద్దిరెడ్డికి కుడి ఎడ‌మ‌లు స‌హా వెనుక ముందు కూడా.. భారీ సెగ త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం.