కాంగ్రెస్‌లో చేరిన క‌డియం ఫ్యామిలీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న‌ కడియం శ్రీహరి.. తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీపాదాస్‌ మున్షి.. కడియం శ్రీహరికి, కావ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చినా ఆమె పార్టీని వీడారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందుతుందని భావించి పార్టీ మారుతున్నామని కడియం శ్రీహరి, కావ్యలు వ్యాఖ్యానించారు. మరోవైపు వరంగల్ ఎంపీ టికెట్ కావ్యకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే.. వీరు పార్టీ మారారు స‌రే. కానీ, నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు మ‌న‌సు మార్చుకుంటారా? నాయ‌కులు మారినంత ఈజీగా ప్ర‌జ‌లు త‌మ మ‌న‌సులు మార్చుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌తంలో టీడీపీ, త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ లో క‌డియం రాజ‌కీయాలు చేశారు.

నిజానికి టీడీపీని వ‌దిలేసిన‌ప్పుడు.. ఆ పార్టీ ఆంధ్రాపార్టీ అని ముద్ర వేసి క‌డియం ప్ర‌జ‌ల‌ను ఒప్పించారు. అందుకే తాను తెలంగాణ సార‌థి.. తెలంగాణ తీసుకువ‌చ్చిన కేసీఆర్ వెంట న‌డుస్తాన‌ని చెప్పి.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించారు. మ‌రి ఇప్పుడు ఏం చెబుతారు? నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్‌లో ఉండి.. అత్యంత కీల‌క‌మైన క్ష‌ణంలో కూడా గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకుని.. బీఆర్ఎస్ లేక‌పోతే.. త‌న‌కు రాజకీయాలే లేవ‌ని చెప్పిన క‌డియం.. ఇప్పుడు కాంగ్రెస్ బాట ప‌డితే ప్ర‌జ‌లు ఒప్పుకొంటారా? అనేది ప్ర‌శ్న‌.

స్టేష‌న్ ఘ‌న్‌పూరే కాదు.. వ‌రంగ‌ల్ వ్యాప్తంగా ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు. బీఆర్ ఎస్‌లో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు. కానీ.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీకి ఇంకా దూరం కాలేదు. అందుకే.. గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టంమీదే అయినా.. బీఆర్ఎస్కు ప‌ట్టం క‌ట్టారు. అంటే.. బీఆర్ ఎస్‌కు ప్ర‌జ‌లు దూరం కాలేదు. కానీ, ఎమ్మెల్యే సీటు ఇచ్చిన క‌డియం మాత్రం దూరం అయ్యారు. కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ఈ వ్య‌వ‌హారం.. ప్ర‌జ‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. సో.. ఎలా చూసినా.. క‌డియం ఎలా ఒప్పిస్తార‌నేది చూడాలి.