శ‌ర‌త్ చంద్రారెడ్డి నుంచి బీజేపీకి 52 కోట్ల విరాళం..

త‌మ‌కు అనుకూలంగా ఉండి.. తమ పార్టీకి విరాళాలు ఇచ్చిన‌వారు ఎలాంటి వారైనా.. బీజేపి వ‌దిలేస్తుందా? బీజేపీ ఇలానే రాజ‌కీయాలు చేస్తుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయిరాజ‌కీయ ప‌క్షాలు. ప్రస్తుతం వెలుగు చూసిన సంచ‌ల‌న విష‌యం.. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించేలా చేస్తోంది. ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల జ‌డివాన ప్రారంభ‌మైంది. ఢిల్లీనే కాదు.. దేశాన్ని సైతం కుదిపేసిన ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం కేసులో తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఈ కేసులో కొన్నాళ్ల కింద‌ట అప్రూవ‌ర్‌గా మారిన శ‌ర‌త్ చంద్రారెడ్డి.. బీజేపీకి 52 కోట్ల విరాళం ఇచ్చిన‌ట్టు తాజాగా వెల్ల‌డైంది.

ఇది రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు దారితీసింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్స్‌గా మారిన రెడ్డి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇందులో ఎక్కువ వాటా బీజేపీకే అందినట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసింది. గతేడాది నవంబర్‌లో లిక్కర్ పాలసీ కేసులో శరత్ అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత ఆయన అప్రూవర్‌గా మారారు.

2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలించగా ఈ విషయం తేలినట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే స్పష్టం చేసింది. రూ.52 కోట్ల విలువైన బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసి బీజేపీకి భారీ మొత్తంలో డొనేట్ చేసినట్టు తెలిపింది. ఇందులో దాదాపు 66% మేర బీజేపీకి వెళ్లగా..మిగతా విరాళాలు బీఆర్ఎస్‌, టీడీపీల‌కు కూడా ముట్టిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన ఐదు రోజుల తరవాత రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది.

నవంబర్ 10వ తేదీన అరెస్ట్ కాగా.. నవంబర్ 15న ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు ఈసీ డేటా వెల్లడించింది. నవంబర్ 21న‌ బీజేపీ వీటిని ఎన్‌క్యాష్ చేసుకుంది. 2023 జూన్‌లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. నిజానికి ఆప్ మంత్రి అతిషి ఇప్పటికే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకే నిధులు మళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఈసీ విడుదల చేసిన లెక్కల్లో అదే విషయం వెల్లడైంది.

2021 నవంబర్‌కి ముందు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో 5 జోన్స్‌లో లిక్కర్‌ వెంట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వచ్చిందని మంత్రి అతిషి వివరించారు. లిక్కర్ పాలసీ 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ అమల్లో ఉన్నప్పుడే బీజేపీకి అరబిందో కంపెనీ నుంచి రూ.3 కోట్ల విరాళం వచ్చినట్టు అతిషి ఆరోపించారు. “శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్‌ ద్వారా శరత్ బీజేపీకి రూ.4.5 కోట్ల విరాళం ఇచ్చాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరవాత బీజేపీకి రూ.55 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ డబ్బంతా బీజేపీ బ్యాంక్ అకౌంట్‌కే నేరుగా వెళ్లింది” అని ఆమె ఆరోపించారు.