పెంచ‌ల కోన‌కు చంద్ర‌బాబు.. అదే సెంటిమెంటు!

రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌ను పాటించ‌డం నాయ‌కుల‌కు కొత్తకాదు. అయితే.. కొందరు మాత్రం ఈ సెంటి మెంట్ల‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో చంద్ర‌బాబు కూడా ఒక‌రు. అయితే.. ఈ ద‌ఫా ఆయ‌న సెంటిమెంట్ల‌కు చేరువ‌య్యారు. ఇప్ప‌టికే ఇంట్లో రెండు సార్లు యాగాలు, య‌జ్క్షాలు చేశారు. ఏకంగా రాజ‌శ్యామ‌ల యాగం కూడా నిర్వ‌హించారు. ఇక‌, ఇత‌ర దేవాల‌యాల‌కు కూడా వెళ్లారు. ఇప్పుడు ఈ సెంటిమెంటులో భాగంగా ఆయ‌న పెంచ‌ల‌కోన‌కు వెళ్తున్నారు.

నెల్లూరు జిల్లా పెంచ‌ల‌కోన‌లో ల‌క్ష్మీనృసింహ స్వామి ఆల‌యం ఉంది. వాస్త‌వానికి ఈ కోన పేరు ‘చెంచుల కోన‌’ అయితే.. కాల‌క్ర‌మంలో ఇది ‘పెంచ‌ల‌’ కోన‌గా మారింది. న‌ర‌సింహ‌స్వామి.. ఉగ్ర రూపాన్ని.. ఇక్క‌డ త‌గ్గించుకున్నార‌ని పురాణాలు చెబుతున్నాయి. చెంచుల‌క్ష్మితో ఆయ‌న‌కు వివాహం కూడా ఇక్క‌డే జ‌రిగింద‌నేది పురాణ ప్ర‌తీత‌. ఇక్క‌డి స్వామిని ద‌ర్శించుకుంటే అనుకున్న కార్యాలు సుల‌భంగా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. ఇక‌, నాయ‌కులు కూడా.. ఇక్క‌డ పూజ‌లు చేసి నామినేష‌న్లను స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితాగా వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నెల్లూరు జిల్లాని వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యంతో ఉన్న చంద్ర‌బాబు.. ఈ సెంటిమెంటు వైపు అడుగులు వేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక్క‌డ పూజ‌లు చేసిన నాయ‌కులు కూడా ఓడిపోర‌నే ప్రాశ‌స్త్యం ఉండ‌డంతో చంద్ర‌బాబు అదే సెంటిమెంటును ఫాలో అవుతున్నారు.

ఇక‌, ఈ పూజ‌ల అనంత‌రం.. ఆయ‌న కుప్పం నుంచిప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించ‌నున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే ఆయ‌న పార్టీ నాయ‌కులకు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ ఇంకా 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. వీరిని కూడా రెండు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.