ఇది జగన్ రెడ్డి మార్క్ సామాజిక న్యాయం!

మళ్ళీ అదే సీన్. ఒక పక్క మంత్రి ధర్మాన, మరోపక్క ఎంపీ నందిగం సురేష్. ధర్మాన మొత్తం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు లిస్ట్ చదివితే, సురేష్ 25 ఎంపి ల లిస్ట్ చదివారు. ఈ మొత్తం కార్యక్రమంలో బీసీ లకు, దళితులకు మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అని చెప్పుకోవడానికి తప్ప, నిజానికి ఈ ఎంపీ, ఎమ్మెల్యే ల ఎంపికలో వీరి పాత్ర ఏమీ వుండదు, బహుశా వాళ్లకు టికెట్స్ ఇస్తున్న విషయం కూడా వారికి చదివే ముందు తెలుసో లేదో. అలానే ఏ కులం వారు ఎంత వుండాలో పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తే, ఆ వర్గాల్లో ఎవరెవరిని ఎంపిక చెయ్యాలో ఐ-ప్యాక్ సూచిస్తే, రకరకాల ప్రాధాన్యతలు బట్టి వారిలో కొందరిని ఎంపిక చేసి లిస్ట్ రాస్తే, ఇలా ఒక బీసీ ని, ఒక ఎస్సీ ని ఎంపిక చేసుకుని వారితో చదివించడం అనే ఒక వ్యూహం వైసీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల నుండి అమలుచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతి అవలంబించింది. పార్టీ పెద్దలు అన్ని డిసైడ్ చేశాక లిస్ట్ బుడుగులతో చదివించి మేము సామాజిక న్యాయం చేశాం చూడండి అని ప్రచారం చేస్తారు. కానీ పేర్లు మాత్రం సగానికి సగం ‘రాజ బంధువులవే’ వుంటాయి. అచ్చొచ్చిన సెంటిమెంట్ అనో, మరో కారణమో గానీ 2019 లానే ఈసారీ పేర్లు చదివే పుణ్యం ధర్మాన, సురేష్ లకే దక్కింది.

ఇంక అభ్యర్థుల ఎంపిక చూస్తే పెద్ద ఆశ్చర్య పడే విషయాలు ఏమీ లేవు. ఎప్పటి లాగే, అందరూ ఊహించినట్టే ‘రాజ బంధువులకే’ ఒక 50 కి దగ్గరగా ఇచ్చేసుకున్నారు. ఇంకా జగన్ ఎప్పుడూ చెప్పే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలకు ఎప్పటి లానే ‘పేరు గొప్ప, ఊరు దిబ్బ’ పద్దతే. మైక్ కనిపిస్తే 60% ఉన్న బీసీలకు 50% పదవులు ఇచ్చాం అని చెప్పుకునే జగన్ రెడ్డి మళ్ళీ రెడ్ల కంటే ఒక నాలుగు మెట్లు తక్కువే అన్నట్టు 8 సీట్లు తక్కువే ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగాక అధిక శాతం రెడ్డి వర్గం తెలంగాణలో ఉంటే ఆంధ్రాలో ఒక 3.5% నుండి 4% మాత్రం మిగిలింది. తానే స్వయంగా అనేక మార్లు 50% పైన ఉన్న బీసీలు అని చెప్పిన వర్గాలకు 41 (29.5%) కేటాయించి, నాలుగు శాతం ఉన్న సొంత వర్గానికి 49(35%) సీట్లు కేటాయించుకొని ప్రేమ కాస్త ఎక్కువే చూపెట్టారు. ఓసీలకు కేటాయించిన సీట్లలో కూడా దాదాపు 58% సొంత వర్గానికి కేటాయించి మిగిలిన 6 వర్గాలకు కలిపి 42% కేటాయించారు.

ఇంకా మైనారిటీలకు 7 సీట్లు కేటాయించి వాటిని కూడా బీసీల లెక్కలో చెప్పుకున్నారు. ఒక అంచనా ప్రకారం ఒక్క రాయలసీమ, నెల్లూరు పరిధిలో రెడ్డివర్గం కంటే మైనారిటీల జనాభా నాలుగైదు లక్షలు ఎక్కువే వుంటుంది కానీ, ఈ ఐదు జిల్లాల పరిధిలో సొంత వర్గానికి 39 సీట్లు కేటాయించి, మైనారిటీలకు 5 మాత్రం కేటాయించారు. ఇంకా ఈ ఐదు జిల్లాలలో బీసీలకు కేవలం 7 మాత్రం కేటాయించారు. ఇక్కడ జనాభా పరంగా మరొక పెద్ద వర్గమైన బలిజలకు ఒక్క సీటూ కేటాయించలేదు. రాయలసీమ, నెల్లూరు పరిధిలో 62 స్థానాలుంటే 39 (63%)సొంత వర్గానికి కేటాయించుకుని, మిగిలిన అన్ని వర్గాలకు కలిపి కేవలం 23(27%) స్థానాలు కేటాయించారు. ఇంకా బీసీలకు అధికంగా కేటాయించినవి, ప్రతిపక్ష పార్టీలు బలంగా వుండి గెలుపుకు అవకాశం లేని కుప్పం, మంగళగిరి, కనిగిరి, గుంటూరు వెస్ట్ వంటి కొన్ని. తద్వారా వాళ్లని బాధితులుగా మార్చి సీట్లు పెంచామనే ప్రచారం చేసుకుంటున్నారు.

దళితులు, గిరిజనులకు వారికి చట్టబద్ధంగా కేటాయించిన స్థానాలు తప్ప అదనంగా ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు చట్టం కలిపించిన 36 స్థానాలు(20.5%) మాత్రమే వారికి కేటాయించి, సొంత వర్గానికి 49 (28%) కేటాయించుకున్నారు. వాస్తవానికి వైసీపీకి ప్రాణం పోసింది ఎస్సీ, ఎస్టీ వర్గాలే, ఇప్పటికైనా ఆ పార్టీ ఖచ్చితంగా గెలవగలదు అని చెప్పే 20 సీట్లలో 10 పైనా రిజర్వుడ్ స్థానాలే ఉంటాయి కానీ వారి కంటే సొంత వర్గానికే అధిక సీట్లు కేటాయించుకున్నారు.

ఇంకా రాష్టంలో అతి పెద్ద కులంగా చెప్పుకునే కాపులకు 21 సీట్లు కేటాయించారు. జనరల్ స్టానల్ ఇది 15% మాత్రమే. కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, వొంటరి వంటి కాపు కులాలు అన్ని కలిపినా వారికి కేటాయించింది 29 (21%), అది రెడ్లకు కేటాయించిన 49 కంటే 20 సీట్లు తక్కువ.

ఎంపీ సీట్లు చూస్తే 25 ఎంపీ స్థానాల్లో 5 (20%) రెడ్లకు కేటాయించి, మిగిలిన ఓసీలు అందరికీ కలిపి 4 (16%) మాత్రం కేటాయించారు. ఇక్కడ మైనారిటీలకు మొండి చేయి చూపించారు, ఎస్సీ, ఎస్టీ లకు కేవలం వారికి చట్టబద్ధంగా దక్కిన 5 స్థానాలు మాత్రమే ఇచ్చారు. గతంలో తమ పార్టీ తరపున గెలిచిన ఎంపీ అభ్యర్థులు దాదాపు డజను మంది పార్టీ మారడమో లేక ఎంపీ వద్దని ఎమ్మెల్యే గా పోటీ చెయ్యడమో జరుగుతుంది. ఇందులో కూడా అసలు అభ్యర్థి ఎవరో కూడా చెప్పకుండా అనకాపల్లి బీసీ లకు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు.

ఇలా టికెట్ల కేటాయింపులు చేసి, లెక్కలు తమకు అనుకూలంగా చెప్పుకుంటూ, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కలిపి చూపెడుతూ 50% సామాజిక న్యాయం చేశామని మీడియాల్లో ఊదరగొడుతున్నారు. మొత్తానికి మరో మారు జగన్ మార్క్ సామాజిక న్యాయం టికెట్ల కేటాయింపులో చూపించారు.

Article By – శ్రీకాంత్ బాలాజీ