ఉరుములు లేని పిడుగు.. క‌విత అరెస్టు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అరెస్ట‌య్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె నిందితురాలిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు శుక్ర వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత వేగం పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చూచాయ కూడా లేకుండానే.. క‌విత ఇంటికి వ‌చ్చిన 12 మంది ఈడీ అధికారులు(వీరిలో ఢిల్లీ నుంచి ఏడుగురు అధికారులు వచ్చారు. ఇందులో ఇద్దరు మహిళా అధికారు లు కూడా ఉన్నారు)  కవిత నివాసంలోకి వెళ్లగా… మిగతా అధికారులు మాత్రం ఇంటి బయట ఉండిపోయారు.

ఈ క్ర‌మంలో  మద్యం కుంభ‌కోణానికి సంబంధించి ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఈ స‌మ‌యంలో క‌విత నివాసంలోకి ఆమె త‌ర‌ఫున న్యాయవాదిని అనుమతించలేద‌ని తెలిసింది. ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. కాగా, క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న వేరేగా ఉంది. ప్రస్తుతం కవిత కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఈ నెల 19న కేసు విచారణ ఉందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని సుప్రీంకోర్టుకు కూడా ఈడీ చెప్పిందని వెల్లడించారు.

కేసు పెండింగ్‌లో ఉన్నందున అధికారులు ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉందని కూడా క‌విత త‌ర‌ఫున న్యాయ‌వాది అన్నారు. తీర్పు వచ్చే వరకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఈడీ స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలిపారు.  అయితే.. ఇంత‌లోనే ఈడీ అధికారులు క‌విత‌ను అరెస్టు చేశారు.  ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్‌గా.. మొత్తం నాలుగు టీమ్‌లుగా ఏర్పడి త‌మ ప‌నిని పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

కేసీఆర్ ప్ర‌య‌త్నాలు..

త‌న కుమార్తె కవిత నివాసంలో ఈడీ సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న ప్ర‌య‌త్నాలు తాను సాగించారు.  పలువురితో ఆకస్మిక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌లతో హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. కవిత ఇంటి వద్ద ఈడీ సోదాలు, స్టేట్‌మెంట్ రికార్డ్ తదితర అంశాలపై ఆరా తీశారు.  

సుప్రీంకోర్టుకు విరుద్ధ‌మా?

సుప్రీం కోర్టులో గ‌తంలోనే ఈడీ అధికారులు క‌విత‌ను అరెస్టు చేయ‌బోమ‌ని చెప్పారు.కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆమెను అరెస్టు చేశారు. మ‌రి ఇది కోర్టు ధిక్క‌ర‌ణ‌కు వ‌స్తుందా? అంటే.. రాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా కూడా క‌విత రేపుమాపు అంటూ త‌ప్పించుకున్నారు. దీంతోనే ఉరుములు లేనిపిడుగులా క‌వితను అరెస్టు చేశార‌నే వాద‌న వినిపిస్తోంది.