వీర్రాజు పోటీ ఇక్కడేనా ?

Somu Veeraju

బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేసే అసెంబ్లీ సీటు ఖాయమైనట్లేనా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసిన విషయం తెలిసిందే. మూడుపార్టీల కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. టీడీపీ ఇప్పటికి 128 స్ధానాలను ప్రకటించింది. జనసేన అధినేత ఏడు నియోజకవర్గాలను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఒక్క సీటును కూడా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుండి వీర్రాజు పోటీకి రెడీ అవుతున్నారట.

నిజానికి సోముకు కైకలూరు నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. రాజమండ్రి అర్బన్ కు చెందిన వీర్రాజు అక్కడి నుండే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఈ సీటును వదులుకోవటం టీడీపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాజమండ్రి సీటు కోసం బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చంద్రబాబు మాత్రం ఇవ్వలేదు. దాంతో తప్పని స్థితిలో వీర్రాజు కైకలూరు ను ఎంపిక చేసుకున్నారట. ఇక్కడినుండి మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ పోటీచేస్తారని అనుకున్నారు. అయితే వయోభారం కారణంగా ఆయన పోటీకి పెద్దగా ఆశక్తిచూపటం లేదని తెలిసింది. అందుకని వీర్రాజు కైకలూరును ఎంచుకున్నారట.

మరి పార్టీకి ఇక్కడ ఏమంత పట్టులేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు టీడీపీ 2009లో  ఒకసారి, 2014లో బీజేపీ ఒకసారి మాత్రమే గెలిచింది. పార్టీకి ఇలాంటి పూర్ ట్రాక్ రికార్డున్న నియోజకవర్గంలో గెలుస్తానని వీర్రాజు ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఎన్నికల్లో పోటీచేయటమే వీర్రాజు టార్గెట్ అయితే ఓకేనే. పోటీచేయటమే కాదు గెలవాలని అనుకుంటే మాత్రం కష్టమే. మూడుపార్టీలు కలిశాయి కాబట్టి ఈజీగా గెలిచేయచ్చని వీర్రాజు అనుకుంటున్నారేమో తెలీదు. గెలుపోటములను ఇప్పుడే చెప్పలేకపోయినా  వీర్రాజు గెలుపు అయితే అంత వీజీ కాదని మాత్రం అర్ధమవుతోంది.

వీర్రాజు గెలవాలంటే చాలా అంశాలు కలిసిరావాలి. ముందు మిగిలిన రెండుపార్టీల నేతలు, క్యాడర్ మనస్పూర్తిగా కష్టపడాలి.  పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించటం అతిపెద్ద సమస్య. తర్వాత ఓట్ల బదిలీ సక్రమంగా జరగాలి. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అప్పుడు వీర్రాజు గెలుపు గురించి ఆలోచించవచ్చు. పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి మిస్సయినా గెలుపు కష్టమనే చెప్పాలి.