పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్: జనసేనానికి తిరుగు లేదంతే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, అప్పుడే జనసేన శ్రేణులు పిఠాపురంలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు.

అసలు విషయమేంటంటే, జనసేన శ్రేణులకే ఆఖర్న తెలిసింది పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పోటీ చేస్తారని. అందరికన్నా ముందు ఈ విషయాన్ని తెలుసుకున్నది అధికార వైసీపీనే. అందుకే, కాకినాడ ఎంపీగా వున్న వంగా గీతను, పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దించుతున్నట్లు ముందుగానే ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కొద్ది నెలల క్రితం వారాహి విజయ యాత్ర సందర్భంగానే జనసేన పార్టీ, పిఠాపురం నియోజకవర్గంలో సర్వే చేయించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గాల్లో ఈ సర్వేలు జరిగాయి. భీమవరం, పిఠాపురం.. రెండు చోట్లా జనసేనానికి సానుకూలత వ్యక్తమయ్యిందట ఆ సర్వేల్లో.

అయితే, భీమవరం కంటే, బెటర్ మెజార్టీ పిఠాపురంలో దక్కుతుందని సర్వేలు తేల్చడంతో, పిఠాపురం వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. ఈ విషయం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి కూడా ముందే తెలుసు. దాంతో, ‘పొత్తు కుదిరితే, పవన్ కళ్యాణ్‌ని తానే గెలిపిస్తాను’ అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు.

కానీ, ఇప్పుడాయన అభిమానులు పిఠాపురంలో నానా యాగీ చేశారు. అయితే, రాజకీయంగా తన ఉనికి ఏంటన్న ఆందోళతోనే వర్మ, తన అభిమానులతో ఈ యాగీ చేయించినట్లు తెలుస్తోంది. ‘పవన్ కళ్యాణ్‌కి ఈ గొడవతో సంబంధం లేదు.. ఆయన్ని అవమానించడం తగదు’ అని తన అభిమానులకు వర్మ తెలివిగా హెచ్చరిక చేసేశారు.

వర్మ, టీడీపీని వీడే అవకాశం లేదు. ఒకవేళ వర్మ తెరవెనుకాల పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పని చేసినా, పిఠాపురంలో పోటీ చేసే జనసేనానికి మెజార్టీ తగ్గబోదట. అసలంటూ వర్మ, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పని చేయబోరని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి.