కాంగ్రెస్ వేట మొదలుపెట్టిందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట మొదలుపెట్టినట్లుంది. అన్నీ స్ధానాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు ధీటైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే వేట మొదలుపెట్టింది. విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బోల్తాపడింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, భువనగిరి లోక్ సభ సీట్ల పరిధిలో ఆశించిన స్ధాయిలో గెలవలేదు.

వీటిల్లో మరీ ముఖ్యంగా మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ లో అయితే బోణికూడా తెరవలేదు. దాంతో పై స్ధానాల పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందనే విషయం అర్ధమైంది. నేతలు బలంగానే ఉన్నప్పటికి జనాల్లో పట్టులేదా ? లేకపోతే కాంగ్రెస్ నేతలకన్నా ప్రత్యర్ధిపార్టీలు బీఆర్ఎస్, బీజేపీల నేతలు ఇంకా బలమైన వారా అన్న విషయమై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ కు వచ్చిన 39 అసెంబ్లీల్లో గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా గెలుచుకుంది. అలాగే బీజేపీ కూడా పర్వాలేదనిపించుకున్నది. కాంగ్రెస్ పరిస్ధితి మరీ పూర్ షో గా తయారైంది.

అందుకనే బీఆర్ఎస్, బీజేపీల్లోని గట్టి నేతలను చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టారని పార్టీవర్గాల సమాచారం. బీఆర్ఎస్ నేతలు బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవటానికి ఇదే ముఖ్య కారణమట. అలాగే ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకోవటంలో భాగంగా చాలా మున్సిపల్ ఛైర్మన్లను, కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారు. ఇదంతా దేనికంటే రేపటి ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ ఎంపీ సీట్లను గెలుచుకోవటం కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మల్కాజ్ గిరి సీటులో మొన్నటివరకు రేవంత్ రెడ్డే ఎంపీగా ఉండేవారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే పార్టీతో పాటు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా అవమానమే. అందుకనే కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే భువనగిరిలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి ఆ సీటులో హస్తంపార్టీ గెలవటం మంత్రికి ప్రిస్టేజిగా మారింది. ఇక్కడ గనుక ఓడితే మంత్రికి ఇబ్బందులు తప్పవు. అందుకనే ఇలాంటి అనేక అంశాలను భేరీజు వేసుకుని ఇతర పార్టీల్లోని గట్టి అభ్యర్ధులను పార్టీలోకి లాక్కునే విషయాన్ని రేవంత్ పరిశీలిస్తున్నారు.