టీడీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ – అమ్మాయలకు ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గానే ‘క‌ల‌ల‌కు రెక్క‌లు’ అనే కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌స్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి హామీ ఇచ్చారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని.. యువ‌త‌ల‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఈ ప‌థ‌కానికి సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆమె స్వ‌యంగా ఆవిష్కరించారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌ను ‘నిజం గెల‌వాలి’ యాత్ర ద్వారా భువ‌నేశ్వ‌రి క‌లుస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఆమె కర్నూలు జిల్లా పత్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పలు కుటుంబాల స‌భ్యుల‌ను క‌లుసుకున్నారు. అనంత‌రం అక్క‌డే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటర్ విద్య‌ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థినులు ఆర్థిక క‌ష్టాల‌తో అక్క‌డితోనే ఆగిపోతున్నార‌ని.. ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేసేందుకు తాను న‌డుం బిగించిన‌ట్టు తెలిపారు. అయితే.. ఒక్క‌రి వ‌ల్ల ఇంత‌మందికి మేలు జ‌ర‌గ‌ద‌ని భావించిన‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ప‌క్షాన కూడా సాయం చేయించాల‌ని భావించాన‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ‘కలలకు రెక్కలు’ పథకాన్ని తీసుకొస్తామని నారా భువనేశ్వరి ప్రకటించారు. ఈ ప‌థ‌కం కింద ఇంటర్ విద్య‌ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థినులకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆర్థిక సాయం అందుతుంద‌న్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే ఈ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్‌ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తామని భువనేశ్వరి తెలిపారు.

కాగా, మ‌హిళా దినోత్స‌వం రోజు నారా భువ‌నేశ్వ‌రితో కీల‌క‌మైన ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించేలా చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే సూప‌ర్ సిక్స్‌, బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ ప‌థ‌కాల‌తో టీడీపీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు కేవలం విద్యార్థుల‌ను ఉద్దేశించి.. అందునా బాలికా విద్యార్థుల‌ను ఉద్దేశించిన కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డం మ‌రింత విశేషం.