‘రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం’

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని.. ఆరు మాసాల్లో సీఎం రేవంత్ దిగిపోతార‌ని.. బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై బుధ‌వారం రేవంత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పాల‌మూరు బిడ్డ‌లు తొక్కి.. పేగులు మెళ్లో వేసుకుంటార‌ని..ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

తాజాగా ఆయ‌న క‌రీంన‌గ‌ర్ బీఆర్ఎస్ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టే వారు ఆ పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్గొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి’ అని కేటీఆర్ అన్నారు.

“నీకు ఫ్రస్టేషన్ ఎక్కువైంది. ఎన్నికలయ్యాక మీ ఎమ్మెల్యేలు బీజేపీలో కలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న కోపాన్ని రైతులపై తీర్చుకుంటోంది. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.?” అని కేటీఆర్ ప్రశ్నించారు.ఇదిలావుంటే, కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ సెంటిమెంట్ అని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు.

ఆనాడు ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని.. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ‘పాలమూరు సభలో సీఎం రేవంత్ భాష నాకు అర్థం కాలేదు. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేవంత్ ఐదేళ్ల పాలన చూశాక ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు అని సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.