ఈ రోజు తేల్చేస్తావా బాబూ..

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. బీజేపీతో పొత్తుంటేనే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయగలమన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నది. పొత్తు విషయమై ఇంత కాలం సస్పెన్స్ గా ఉన్న చర్చలు ఇపుడు కొలిక్కి వస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో చర్చించారు. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం ఏమిటో బయటకు రాలేదు. చర్చల సారాంశం పైన తుది ఫలితంపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. దాంతో పొత్తుపై ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు.

ఎందుకంటే ఫిబ్రవరిలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ తర్వాత మళ్ళీ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. అందుకనే రకరకాల ఊహా గానాలకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. సడెన్ గా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను రమ్మని ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. గురువారం ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో భేటీ అవబోతున్నారని సమాచారం. అవసరమైతే రెండురోజులు ఢిల్లీలోనే ఇద్దరు కూర్చుని సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేసుకుని వస్తారని ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ, టీడీపీ పొత్తు కుదరాలంటే ముంటే టీడీపీ ఎన్డీయేలో చేరాలి.

రెండుపార్టీల మధ్య సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ అయిపోతే అధికారికంగా టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని అంటున్నారు. టీడీపీ ఎన్డీయేలో చేరిన తర్వాత పొత్తులో మూడుపార్టీలు పోటీచేయబయేసీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటిస్తారని సమాచారం. ఇదంతా రెండుమూడు రోజుల్లోనే అయిపోతుందని కూడా పార్టీవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీకి టీడీపీ మ్యాగ్జిమమ్ 15 అసెంబ్లీలు ఆరు పార్లమెంటు సీట్లు కేటాయించే అవకాశముందట.

నిజానికి ఇప్పటికే సీట్ల సర్దుబాటు చాలా ఆలస్యమైంది. ఒకవైపు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మార్పులు అవసరం అనుకున్న 70 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులను ప్రకటించటంతో పాటు కొన్ని నియోజకవర్గాలకు ఎంఎల్ఏలను మార్చారు. ఇంకా ఏమైనా మార్పులుంటాయా అన్నది తేలటంలేదు. ఒకవేళ అభ్యర్ధుల మార్పులు, చేర్పులు అయిపోతే 105 నియోజకవర్గాల్లో సిట్టింగులకు టికెట్లు ఖాయమైపోయిందనే అనుకోవాలి. మరి చంద్రబాబు, పవన్ ఢిల్లీ టూర్ తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో చూడాలి.