‘జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టింది.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం’

ఏపీ స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి రూ.370 కోట్లు తీసుకురావ‌డం ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఒక‌సారి దీనిపై ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె లాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టడంపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం ప్రభుత్వ భవనాలను కాదని…తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం పరువు, ప్రతిష్ఠను వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని.. ఇప్పుడు ఏకంగా పరిపాలన భవాన్నే తాకట్టు పెట్టడం ద్వారా ఏపీ బ్రాండ్ మరింత దిగజారనుందన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్ట‌డం రాష్ట్రానికి ఎంతో అవమానకరమన్నారు. రూ. 370 కోట్ల అప్పుకోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చునే భవనాన్నే తాకట్టు పెట్టడం సిగ్గుచేటన్నారు. అసలు ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను మాత్రమే కాదని..రాష్ట్రం పరువు, ప్రతిష్ఠ, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.

ఎంతో కష్టపడి సంపాదించిన ఏపీ బ్రాండ్ విలువను సీఎం జగన్ రోజురోజుకు సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మరోసారి జగన్ కు ఓటు వేస్తే..ఈసారి ప్రజలను సైతం అమ్మకాలని పెట్టేస్తాడని హెచ్చరించారు. కాగా, వైసీపీ ప్రభుత్వం సర్కార్ భవనాలు తాకట్టు పెట్టడం ఇదే తొలిసారి కాదని…గతంలోనూ విశాఖలోని విలువైన భవనాలు, ఖాళీస్థలాలను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం తీవ్ప వివాదానికి దారి తీసింది.

అప్పట్లో పెద్దఎత్తున విమర్ళలు చెలరేగాయి. ఇప్పుడు ఏకంగా సెక్రటరేయేట్ ను తాకట్టు పెట్టడంతో ప్రజలు అవాక్కవుతు న్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. ఇప్పటికే పరిధికి మించి లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏ రోజుకు ఆరోజు ఆర్బీఐ వద్ద చేబదులు తీసుకుంటే తప్ప రోజులు గడవని పరిస్థితులు నెలకొన్నాయ‌ని చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు వ్యాఖ్యానించారు.