వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయం: చంద్ర‌బాబు

తాము అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చినా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని చెప్పారు. అనంత‌పురం జిల్లా పెనుకొండలో నిర్వ‌హించిన‌ ‘రా కదలిరా’ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌లంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వ‌లంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నాన‌న్నారు. వ‌లంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

“అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఇది. అలాంటి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించాం. కియా పరిశ్రమను తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాం. కియా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ను 18 నెలల్లో పూర్తి చేసిన నీరు అందించాం. 2014లో పెనుకొండ ప్రాంతం ఎలా ఉంది… ఇప్పుడెలా ఉంది? కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధిస్తున్నారని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. “ఖబడ్దార్… జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ… మంచికి మంచి. తమాషా అనుకోవద్దు. నాడు అనంతపురం జిల్లాలో రక్తం పారించారు… నేను వచ్చి నీళ్లు పారించాను. రాష్ట్రాన్ని మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు” అని వైసీపీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తాము తీసుకుంటున్నామ‌న్నారు. ప్రజల తరఫున నాయకులుగా తాను, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకెళతామ‌ని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని… మీరు సిద్ధమా అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట పేరుతో నాశనం చేశాడని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అందుకే సూపర్ సిక్స్ తీసుకువచ్చా మ‌న్నారు. “సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. మహిళలకు, రైతులకు, యువతకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు న్యాయం చేసి, రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిపథంలో నడిపించే బాధ్యత మాది” అని చంద్ర‌బాబు చెప్పారు.

సీటుపై స్ప‌ష్ట‌త‌

చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌లో పెనుకొండ సీటుపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా సబితను నిలబెడుతున్నామ‌న్నారు. ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తమ్ముళ్లకు అప్పజెప్పి వందల ఎకరాలు దోచేశాడని మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. పెన్నా నది నుంచి బెంగళూరుకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ… ఇంకొక ఆవిడ వచ్చిందని .. ఆయన కంటే భయంకరమైన వ్యక్తి అని మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.