ప‌వ‌న్ కంఠ శోష‌.. అర్ధం కావ‌డం లేదా?

కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేత‌లు క‌లిసి రావాలి.. అప్పుడే వైసీపీని గ‌ద్దెదించ‌గలం అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్ట‌గానే ప‌రుగులు పెట్ట‌ద‌న్న‌ట్టుగా.. జ‌న‌సేన కూడా.. ప‌రుగులు పెట్టేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభ‌వాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటే ఈ విష‌యం అవ‌గ‌తం అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మ‌న‌మే న‌ష్ట‌పోతాం” అని చెప్పుకొచ్చారు.

అదేస‌మ‌యంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక స్థానంలో విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. అలా కాకుండా.. 10 చోట్ల అయినా విజ‌యం ద‌క్కించుకుని ఉంటే వేరే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కూడా ప‌వ‌న్ చాటు తున్నారు. మ‌రీ ముఖ్యంగా రెండు చోట్ల తాను పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయార‌ని కూడా వ్యాక్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎగిరే బ‌దులు.. క‌లిసి న‌డిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు. దీనికి అంద‌రూ క‌లిసిరావాల‌ని అంటున్నారు.

త‌ద్వారా పార్టీ పుంజుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మీ క‌ల‌లు ఫలించే అవ‌కాశం ఉంద‌ని కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. దీనివెనుక వ్యూహం స్ప‌స్టంగా ఉంది. ‘ఒంటె మంత్రం’ ప‌ఠిస్తున్నార‌న్న వినికిడి కూడా ఉంది. ముందు మెల్ల‌మెల్ల‌గా గుడారంలోకి అడుగు పెట్టిన ఒంటె.. త‌ర్వాత‌.. ఏం చేసిందో అంద‌ర‌కి తెలిసిందే అలాగే ముందుకు 24 నుంచి ప్రారంభించి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రిన్ని సీట్ల దిశ‌గా పార్టీని న‌డిపించే వ్యూహంలో అధికారాన్ని పంచుకునే ఉద్దేశంతో ప‌వన్ ఉన్నార‌నేది తెలుస్తోంది.

కానీ, ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కొంద‌రు ప్ర‌బుద్ధులు.. ఎవ‌రి ప్రోత్సాహంతోనో.. లేఖ‌లు సంధించ‌డం.. కాపుల్లో ఉన్న ఐక్య‌త‌ను దునుమాడ‌డం.. ప‌వ‌న్‌ను ఒంట‌రిని చేయ‌డం.. వారి ఓటు బ్యాంకును ఒక అనిశ్చితిలోకి నెట్ట‌డం అనే క్ర‌తువును భుజాన వేసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడూ పిడి వాదం ప‌నికిరాదు.ప‌ట్టువిడుపులు అత్యంత ముఖ్యం. ఈ దిశ‌గానే ప‌వ‌న్ వేస్తున్న అడుగులకు క‌లిసి వ‌స్తే.. కాపుల‌కు మేళ్లు క‌నుచూపు మేర‌లోనే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.