సుప్రీం కోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా మరోసారి ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల తర్వాత ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని, తక్షణమే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ, సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దానికి సంబంధించిన వివరాలతో కూడిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేశామని కోర్టుకు విన్నవించారు. ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తూ తామ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపించారు. దాంతోపాటు బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయని వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫున ముగ్గురు రోహిత్ కి వాదనలు వినిపించగా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం ఇస్తామని హరీష్ చెప్పారు. దీంతో రెండు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మూడు వారాల తర్వాత ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని కోర్టు తీర్పు చెప్పింది‌. సీట్ల పంపకం, పొత్తుల వ్యవహారం పై కీలక దశలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టు తాజా తీర్పు భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు.