వైసీపీకి ఎంపీ ర‌ఘురామ రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, ఫైర్ బ్రాండ్ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను త్వ‌ర‌గా.. సాధ్య‌మైనంత వేగంగా ఆమోదించాల‌ని ఆయ‌న కోరారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు ఆయ‌న నేరుగా అధికారిక ప‌త్రంపై లేఖ‌ను పంపించారు. “మీరు న‌న్ను అన‌ర్హుడినిచేయాల‌ని అనుకున్నా.. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును ప్ర‌జాస్వామ్యం గౌర‌వించి.. న‌న్ను కాపాడింది” అని పేర్కొన్నారు.

న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఎన్నుకున్నందుకు..వారికి తాను ఎంతో దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. సేవ‌ల విష‌యంలో మాత్రం లోటు రాలేద‌ని చెప్పారు. మీరు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌నందుకు నేను కూడా ఒక‌ప్పుడు చింతించాన‌ని పేర్కొన్నారు. (ఎంపీగా అన‌ర్హ‌త వేటు వేయించ‌డంలో) అంద‌రం ప్ర‌జాతీర్పు కోర‌వ‌ల‌సిన అవ‌స‌రం, స‌మ‌యం రెండూ వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. న‌ర‌సాపురం స‌మ‌గ్ర అభివృద్ధికి ఎన‌లేని సేవ చేసిన‌ట్టు ర‌ఘురామ తెలిపారు. ఈ నేప‌థ్యంలో పార్టీకి, క్రియాశీల‌క స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

రెబ‌ల్‌గా 4 ఏళ్లు!

కాగా, 2019 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావరి జిల్లా నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కేవ‌లం ఏడాది కాలంలోనే పార్టీకి రెబ‌ల్‌గా మారారు. స్థానికంగా.. ఉన్న వైసీపీ నాయ‌కుల ప్ర‌భావం, వారి ఆదిప‌త్యంతో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ర‌ఘురామ‌.. పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రెండుసార్లు.. పార్టీ నుంచి చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ ఏదోతేడా మాత్రం కొన‌సాగింది. దీనికితోడు ఎంపీ అనుచ‌రుల‌పై స్థానిక ఎమ్మెల్యేలు..కేసులు పెట్ట‌డం.. ఆయ‌న ఫ్లెక్సీలు పెట్ట‌కుండా అడ్డుకోవ‌డం వంటి ప‌రిణామాల‌తో ప్రారంభ‌మైన వివాదాలు.. రెబ‌ల్‌గా మారే వ‌ర‌కు సాగాయి.