నో చేరికలు..పెరిగిపోతున్న టెన్షన్

ఫిబ్రవరి నెలను తెలంగాణా బీజేపీ నేతలు జాయినింగ్ మంత్ అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారంటూ మొన్నటి జనవరిలో ఊదరగొట్టేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి చాలామంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి చాలామంది చెప్పుకున్నారు. తీరా చూస్తే జాయినింగ్ మంత్ మొదలై 18 రోజులు అయిపోయింది కాని గట్టి నేతలు వచ్చింది లేదు, చేరిందీ లేదు. దీంతో బీజేపీ సీనియర్లలో టెన్షన్ పెరిగిపోతోంది. అగ్రనేతలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలీటంలేదట.

ఏదో తూతుమంత్రంగా అక్కడక్కడ ఎంపీపీలు, జడ్పీటీసీలు మాత్రమే జాయిన్ అయ్యారు. ఇలాంటి వాళ్ళవల్ల చెప్పుకోదగినంత ప్రభావం కనపించదని అందరికీ తెలిసిందే. బండి సంజయ్ అయితే బీఆర్ఎస్ నుండి ఐదుగురు ఎంపీలు వచ్చేస్తున్నారని చాలా రోజుల నుండి చెబుతునే ఉన్నారు. పదిమంది ఎంఎల్ఏలు కూడా తమతో టచ్ లో ఉన్నారని నానా రచ్చ చేస్తున్నారు. అయితే వీళ్ళ మాటలను పార్టీలోని నేతలే చాలామంది నమ్మటం లేదు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

నిజంగానే పై రెండు పార్టీల మధ్య పొత్తుంటే గనుక బీఆర్ఎస్ కు చెందిన ఏ స్ధాయి నేత కూడా బీజేపీలో చేరడానికి ఇష్టపడరు. ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే అయినప్పుడు ఇక బీఆర్ఎస్ లోనే కంటిన్యు అయితే ఏమిటి ? బీజేపీలో చేరితే ఏమిటి ? రెండు పార్టీల్లో దేనిలో ఉన్నా ఎవరికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఒకవేళ పొత్తున్నది కేవలం కల్పితమే అయితే అప్పుడు కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి రావడానికి పెద్దగా ఇష్టపడరు.

ఎందుకంటే జాతీయస్థాయిలో బీజేపీ బలంగా ఉండచ్చు కాని తెలంగాణలో మాత్రం ఒక మోస్తరు పార్టీనే కాని ఏమంత బలమైన నేతలు, క్యాడర్ ఉన్న పార్టీ అయితే కాదు. మిగిలిన పార్టీల్లో ఉన్నట్లే కమలంపార్టీలో కూడా విపరీతమైన గ్రూపు రాజకీయాలున్నాయి. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ లో నుండి బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళ పరిస్ధితి ఎలాగుందో అందరు చూస్తున్నదే. కాబట్టి జాయినింగ్ మత్ అయిన ఫిబ్రవరిలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ నేత ఇతర పార్టీల్లో నుండి ఎవరూ రాలేదన్నది వాస్తవం.