రెడ్లను ప్రేమిస్తున్న టి బీజేపీ

తెలంగాణాలో బీజేపీ బీసీ నినాదాన్ని గాలికొదిలేసినట్లుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సడెన్ గా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. నరేంద్రమోడి, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదాన్ని వినిపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. బీసీ ఓట్లను ఆకర్షించటంలో భాగంగానే ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు ప్రచారమయ్యేట్లుగా చూశారు. ఇంతే కాకుండా 119 అసెంబ్లీ అభ్యర్ధుల్లో ఎక్కువగా బీసీలకే టికెట్లిచ్చారు.

ఇంతచేసినా బీజేపీ గెలుచుకున్నది 8 సీట్లు మాత్రమే. ఇందులో కూడా ముగ్గురు మాత్రమే బీసీలుండగా మిగిలిన ఐదుగురు అగ్రవర్ణాల నేతలే. దాంతో బీసీ నినాదం పారలేదని అగ్రనేతలకు అర్ధమైపోయింది. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీ నినాదాన్ని వదిలేయాలని డిసైడ్ అయ్యిందట. అందుకనే మళ్ళీ రెడ్లకే పదవులను కట్టబెడుతోంది. బీజెఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి ఎంపిక ఇందులో భాగమేనట. అంతేకాకుండా ఈమధ్య నియమించిన అనేకమంది జిల్లా అధ్యక్షుల్లో కూడా రెడ్లనే ఎక్కువమందిని నియమించినట్లు పార్టీవర్గాల సమాచారం.

మహిళామోర్చా అధ్యక్షపదవిలో కూడా రెడ్డి మహిళనే నియమించింది. అలాగే కీలక పదవుల్లో రెడ్లని పెట్టింది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండటం అందరికీ తెలిసిందే. ఇవన్నీ సరిపోదన్నట్లుగా తొందరలోనే ఎంపికచేయబోయే పార్లమెంటు అభ్యర్ధుల్లో కూడా రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అగ్రనేతలు ఇప్పటికే డిసైడ్ అయ్యారట. ఎన్నికల్లో బీసీ నేతను ముందుపెట్టడం కన్నా రెడ్డి నేతను ముందుపెడితే ఎక్కువ ఓట్లు వస్తాయని అనుభవంలో తెలిసిందట.

మొత్తం 19 పార్లమెంటు సీట్లలో అత్యధికం బీసీలకే కేటాయించాలని ఒకపుడు అనుకున్నది వాస్తవం. అయితే ఇపుడు పరిస్ధితులు మారిపోయినట్లు పార్టీవర్గాల సమాచారం. తాజా సమీకరణల ప్రకారం నాలుగు లేదా మూడు సీట్లిస్తే సరిపోతుందని అనుకుంటున్నారట. ముదిరాజ్, మున్నూరాకాపు, గౌడ్ వర్గాలకు తలా ఒకసీటు కేటాయిస్తే సరిపోతుందని అగ్రనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే గతంలో జరిగిన పరిణామాల కారణంగా ఎక్కువమంది బీసీ నేతలు ఎంపీ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపధ్యంలో సడెన్ గా బీసీల కోటాను తగ్గించేయాలని అనుకోవటం అంటే ఫలితాలు ఎలాగుంటుంయో చూడాలి.