జోరు పెంచబోతున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచుతున్నారు. మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. 14వ తేదీన మొదలయ్యే పర్యటనలో మొదట భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పైనాలుగు నియోజకవర్గాల్లో కూడా అచ్చంగా బహిరంగసభలనే కాకుండా పార్టీ ముఖ్యులు, సమాజంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు, ప్రభావశీలురతో భేటీ అవబోతున్నారు. అలాగే పార్టీలోని వీరమహిళలు, వార్డు స్ధాయిలో పనిచేసే నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జనాలతో మమేకం అవటం కోసం బహిరంగసభల్లో పాల్గొంటారు.

మొత్తంమీద పవన్ దృష్టంతా ఉభయగోదావరి జిల్లాల మీదే కేంద్రీకృమైన విషయం తెలిసిందే. ఎందుకంటే టీడీపీతో పొత్తులో తీసుకోబోతున్న సీట్లలో కూడా ఎక్కువ భాగం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉండబోతోంది. రెండు జిల్లాల్లోని 34 సీట్లలో జనసేనకు 12 సీట్లను అడుగుతున్నారు. పొత్తులో జనసేనకు దక్కుతుందని అనుకుంటున్న 25 సీట్లలో 12 సీట్లు గోదావరి జిల్లాల్లోనే కావాలని పవన్ అడుగుతున్నారంటేనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది.

పనిలోపనిగా పవన్ పోటీచేస్తారని ప్రచారంలో ఉన్న భీమవరం, కాకినాడ నియోజకవర్గాల్లో కూడా గట్టి దృష్టిపెట్టారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిన చోటే గెలవాలన్నది పవన్ పట్టుదలగా పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎంఎల్ఏ ద్వారపురెడ్డి చంద్రశేఖరరెడ్డికి పవన్ కు ఏమాత్రం పడదు. ఒక్కళ్ళని మరొకళ్ళు అమ్మనాబూతులు తిట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

పైగా భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, కాకినాడలో ద్వారపురెడ్డి పదేపదే పవన్ తమ నియోజకవర్గాల్లో పోటీచేయమని చాలెంజులు విసురుతున్నారు. మరి పవన్ పోటీచేస్తారో లేదో తెలీదు కాని పై రెండు నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టయితే పెట్టింది వాస్తవం. అందుకనే పార్టీలో కూడా పై రెండు నియోజకవర్గాల్లో పవన్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. మరి పవన్ నిజంగానే పై నియోజకవర్గాల్లో పోటీచేస్తారా ? లేకపోతే మిత్రపక్షాల అభ్యర్ధులు రంగంలోకి దిగుతారా అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.