బాబుపై ‘ఫ్యామిలీ టిక్కెట్స్’ ప్రెజర్

రాబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో సూపర్ సీనియర్ల కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు రెండు టికెట్ల కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తులోనే టీడీపీ పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతున్నాయి. తాజా డెవలప్మెంట్లలో బీజేపీ కూడా చేరుతుందనే అంటున్నారు. ఒకవేళ కమలంపార్టీ కూడా పొత్తులో చేయికలిపితే టీడీపీ పోటీచేయబోయే సీట్లు మరిన్ని తగ్గిపోతాయి.

ఒకవైపు పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతుండగా మరోవైపు సీనియర్ నేతలు కుటుంబానికి రెండు టికెట్లు తీసుకుంటే మిగిలిన నేతల్లో అసంతృప్తి తప్పదని చంద్రబాబు గ్రహించారు. అందుకనే సూపర్ సీనియర్ తమ్ముళ్ళ కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని చెప్పేశారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీకి, కొడుకు చింతకాలయ విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడులోను కొడుకు శ్రీరామ్ కు ధర్మవరంలోను టికెట్ కావాలని పట్టుబడుతున్నారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు కర్నూలు ఎంపీగాను, భార్య సుజాతమ్మకు ఆలూరు ఎంఎల్ఏగా టికెట్ అడుగుతున్నారు. పోయిన ఎన్నికల్లో వీళ్ళిద్దరు పై స్ధానాల్లో పోటీచేసి ఓడిపోయారు. కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్ తో పాటు కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు పత్తికొండ సీటును ఆశిస్తున్నారు. అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంఎల్ఏగా, కూతురు అదితికి విజయనగరం ఎంఎల్ఏగా టికెట్లు కేటాయించాలని అడుగుతున్నారు. జేపీ కుటుంబంలో జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎంఎల్ఏ టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు.

ఇన్ని కుటుంబాలకు రెండేసి టికెట్లిస్తే మిగిలిన నేతలు ఊరుకోరని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ముందుజాగ్రత్తగా శనివారం సమావేశంలో కుటుంబానికి ఒక్క టికెట్టే అని కచ్చితంగా చెప్పేశారట. మరి మిగిలిన సీట్లను ఇతర సీనియర్లకు కేటాయిస్తారా లేకపోతే పొత్తులో జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. చివరకు ఏమిచేస్తారో చూడాలి.