మొన్న సునీత‌.. నేడు ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌లు అందునా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సోద‌రీమ‌ణులు త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ.. ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. నాలుగు రోజుల కింద‌ట త‌న ప్రాణాల‌కు హాని త‌ల‌పెడతున్నారంటూ.. దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సైబ‌రాబాద్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. త‌న తండ్రి హ‌త్య కేసులో అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నాన‌ని.. త‌న‌ను లేపేస్తామంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని సునీత పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

ఇక‌, తాజాగా సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కూడా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న భ‌ద్ర‌త‌ను త‌గ్గించార‌ని, పెంచ‌మ‌న్నా పెంచ‌డం లేద‌ని..ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. “నాకు భ‌ద్ర‌త‌ కల్పించకపోవడం అంటే.. నా చెడును కోరుకుంటున్నారనేగా అర్థం” అని అన్నారు. ఏపీలో తాను రాజ‌కీయంగా తిరుగుతున్నాన‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం.. రాష్ట్ర స‌ర్కారు బాధ్య‌త‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. కానీ, తాను కోరుతున్నా.. భ‌ద్ర‌త‌పై ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు.

“ఒక మహిళన‌ని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలిన‌నే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారు” అని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పోస్టుల‌పై ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “ఈ ప్ర‌భుత్వానికి, ఈ పాల‌కుల‌కు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా?” అని ష‌ర్మిల నిల‌దీశారు `’మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా?’ అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ప్ర‌శ్నించారు. కాగా, ఇటీవ‌ల ఏపీ డీజీపీకి ఆమె వ‌రుస లేఖ‌లు రాశారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఇక‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ర‌ఘువీరా రెడ్డి, గిడుగు రుద్ర‌రాజులు కూడా ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. కోరుతూ లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే.