మోడీ వ్యూహాన్ని బ‌య‌ట పెట్టేసిన ముఖ్య‌మంత్రి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ్యూహాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ బ‌య‌ట పెట్టేశారు. దేశంలో ఏం జ‌ర‌గాల‌ని బీజేపీ కోరుకుంటోందో.. ఏం జ‌ర‌గాల‌ని హిందూత్వ వాదులు కోరుతున్నారో.. ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. బుధ‌వారం యూపీ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. “ఔను.. బీజేపీ వ్యూహం స‌రిగా అర్ధం కాన‌ట్టు లేదు. మీకు( మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌) మా వ్యూహాలు అర్ధం కాక‌పోవ‌డ‌మే మంచిది. అదే మేం కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానిస్తూనే.. దేశంలో బీజేపీ ఏం చేయాల‌ని అనుకుంటోందో ఆయ‌న చెప్పారు.

“మేం మూడు ప్రాంతాల‌ను కోరుకుంటున్నాం. అయోధ్య‌… ఇప్ప‌టికే సాధించాం. ఇక‌, కాశీ, మ‌ధుర‌లు మిగిలాయి. మ‌ళ్లీ బీజేపీ నే వ‌స్తుంది. వాటిని కూడా సాధిస్తుంది” అని సీఎం యోగి చెప్పేశారు. ఈ మూడు ప్రాంతాల్లోనూ మ‌సీదులు ఉండ‌డం, ముస్లింలు ప‌విత్ర ప్రాంతాలుగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. అయోధ్య‌లో ఇప్ప‌టికే రామ‌మందిరం నిర్మించేశారు. దీనిని ప్ర‌పంచ వ్యాప్త ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మార్చుతున్నట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు కాశీలోని జ్ఞాన‌వాపీ మ‌సీదు ప్రాంతంలో హిందే ఆల‌యాలు ఉన్నాయ‌నే విష‌యం వెలుగు చూడ‌డం.. అక్క‌డ‌ పూజ‌లు చేసుకునేందుకు హిందువులకు అనుమ‌తులు కూడా ఇచ్చారు.

ఇక‌, మిగిలింది మ‌ధుర‌. ఇది శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థానం. అయితే.. ఇక్క‌డ కూడా.. మ‌సీదు ఉంది. ఇప్పుడు దీనిపైనే బీజేపీ దృష్టి కేంద్రీక‌రించింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. త‌మ అజెండాలో దీనిని చేర్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి యూపీలో 80 స్థానాల‌ను కైవసం చేసుకుంటామ‌ని..ఈ మూడు ప్రాంతాల‌ను తాము అజెండాలో చేర్చుకుంటామ‌ని తాజాగా సీఎం యోగి ప్ర‌క‌టించ‌డం చూస్తే.. మోడీ వ్యూహాన్ని ఆయ‌న చెప్పేసిన‌ట్టు అయింది.

‘సనాతన ధర్మం ఆచరించే వారంతా అయోధ్యలో రామాలయం నిర్మాణంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ శతాబ్దంలోనే ఇంతపెద్ద ఈవెంట్‌ జరిగితే విపక్షాలు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ అయోధ్యలోని సరికొత్త, భవ్య రామాలయాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఈపని ఎప్పుడో జరగాల్సింది’ అని యోగి చెప్ప‌డం గ‌మ‌నార్హం.