సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడా? :ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ఆ పార్టీని వీడి జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సొంత చెల్లిని తిట్టించేవాడు.. అర్జునుడు ఎలా అవుతాడు? అని నిల‌దీశారు. ఆయ‌న‌లో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు.

“తోడబుట్టిన చెల్లి షర్మిలని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు? తండ్రి హత్య దోషులెవరో తేలాలని అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్న మరో చెల్లి సునీతకి ప్రాణ హాని ఉందని భయపెట్టేవారికి మద్దతు ఇస్తున్న వాడు సవ్యసాచి ఎలా అవుతాడు?” అని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు.

ఇది క‌లియుగం బ్రో!
“ఇది క‌లియుగం..ఇక్క‌డ అర్జునులు, కృష్ణుడు ఉండ‌రు బ్రో!” అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ త‌న సిద్ధం సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. తామేదో ఆయనను ఇబ్బందిపెడుతున్నట్లు, విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తున్నార‌ని, తాను అర్జునుడు న‌ని తానే చెప్పుకొంటున్నార‌ని వ్యాఖ్యానించారు. కానీ, ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండడు అని అన్నారు. “నేను పవన్.. ఆయన జగన్.. అంతే!” అని త‌న దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు.

ఓడిపోతున్నాన‌నే బాధ క‌నిపిస్తోంది
“ఓడిపోతున్నాను అనే బాధ జగన్ రెడ్డిలో స్ప‌ష్టంగా కనిపిస్తోంది” అని ప‌వ‌న్ అన్నారు. జ‌గ‌న్‌ పడుతున్న వేదన చూస్తే.. త‌న‌కే బాధ‌క‌లుగుతోంద‌న్నారు. తాను అర్జునుడు అంటూ ప్రజలు ఆయుధాలుగా మారాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. ఎవరు దోపిడీదారులో, ఎవరు అవినీతిపరులో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరి స్వగతాలు అవసరం లేదు. నేను ఎప్పుడూ జగన్ ను తగ్గించి మాట్లాడలేదు. వ్యక్తిగత విమర్శలు చేయలేదు” అని ప‌వ‌న్ అన్నారు. రాజ‌కీయాల్లోకి వైసీపీ వచ్చాక రాజకీయాలు దిగజారిపోయాయని విమ‌ర్శించారు. దేశంలోనే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

చుక్క‌లు చూపిస్తాం.. ‘సిద్ధం’గా ఉండండి!
రాష్ట్రం అంతా సిద్ధం… సిద్ధం అంటూ పోస్టర్లతో వైసీపీ హంగామా చేస్తోందని ప‌వ‌న్ అన్నారు. అయితే దేనికి సిద్ధమో? ఎందుకు సిద్ధమో? ఎవరికీ అంతుపట్టడం లేదని ఎద్దేవా చేశారు. “మేము కూడా ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నాం. రోజు మీకు సవాల్ విసురుతాం. మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే అంతులేని భయాన్ని ఇస్తాం. సిద్ధంగా ఉండండి. నేను కూడా అన్నిటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చాను” అని ప‌వ‌న్ అన్నారు.

నేను ప్రజా కూలీ
తాను ప‌వ‌ర్ స్టార్‌కాద‌ని.. ప్ర‌జాకూలీ అని ప‌వ‌న్ పేర్కొన్నారు. “న‌న్ను పవర్ స్టార్ అని పిలిస్తే అంతగా నచ్చదు. దేశం కోసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు, పని చేస్తాడు అని ప్రజలు తమ మనసుల్లో అనుకునే దానికంటే పెద్ద బిరుదు ఏం ఉంటుంది. పవర్ స్టార్ అనే కంటే ప్రజా కూలీ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను” అని ప‌వ‌న్ అన్నారు.