“వైసీపీలోనే ఉంటా.. నా స‌త్తా చూపిస్తా!”

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ టికెట్ ద‌క్క‌ని వారు కొంద‌రు.. పార్టీలు మారేందుకు రెడీ అవుతు న్నారు. ఇప్ప‌టికే పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థి, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజీ, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్ వంటివారు మంత‌నాలు చేస్తున్నారు. ఇక‌, టికెట్ ఆశిస్తున్న‌వారిలో కీల‌క నేత, బీసీ నాయ‌కుడు జంగా కృష్ణ‌మూర్తి కూడా పార్టీ మార్పున‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో క‌ర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్‌ కుమార్ కూడా టికెట్ ద‌క్క‌క పోవ‌డంతో పార్టీ మార్పున‌కు లేదా. ఒంట‌రిగా పోటీకి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, ఈ వ‌రుస‌లోనే మ‌రో ఎంపీ ఉన్నారు. ఆయ‌న‌కు కూడా వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌నే హిందూపురం పార్ల‌మెంటు స‌భ్యుడు గోరంట్ల మాధ‌వ్‌. ఈయ‌న త‌న‌కు టికెట్ లేద‌ని తెలిసిన త‌ర్వాత‌.. చాలా రోజులు విజ‌య‌వాడ‌, గుంటూరులోనే మ‌కాం వేసి.. పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగారు. క‌నీసం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాల‌ని ప్రాథేయ ప‌డ్డారు. కానీ, పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేసింది.

దీంతో విసుగెత్తిపోయిన ఎంపీ మాధ‌వ్ ఇప్పుడు కింక‌ర్త‌వ్యం అంటూ.. త‌ల‌ప‌ట్టుకున్నారు. వాస్త‌వానికి పైన చెప్పుకొన్న నాయ‌కుల‌కు టికెట్ ద‌క్క‌క‌పోయినా.. ఇత‌ర పార్టీల్లో చేరే అవ‌కాశం ఉంది. అయితే.. టీడీపీ లేక‌పోతే.. జ‌న‌సేన ఈ రెండూ కూడా కాదంటే.. కాంగ్రెస్ పార్టీలో అయినా.. చేరి.. టికెట్ ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. కానీ, త‌న చేష్ఠ‌ల‌తో అన్ని విధాలా చెడిపోయిన మాధ‌వ్‌ను చేర్చుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ముఖ్యంగా ఇలాంటివాటికి టీడీపీ, జ‌న‌సేన‌లు దూరంగా ఉంటాయి. ఇక‌, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్‌ ష‌ర్మిల మ‌హిళ క‌నుక‌.. ఇలాంటి వారికి ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి లేదు.

దీంతో మాధ‌వ్ ఇప్పుడు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని చెబుతున్నార‌ట‌. దీనికి త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వ్యాపార వేత్త‌లు సాయం చేయాల‌ని.. ఆయ‌న వ‌ర్త‌మానం పంపుతున్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో కుర‌బ‌ సామాజిక వ‌ర్గంలో చీలిక తెచ్చి వారిని కూడా.. త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని భావిస్తున్నారు. దీంతో ఎవ‌రు ఆయ‌న‌ను క‌లిసినా.. “వైసీపీలోనేఉంటా.. నేనేంటో చూపిస్తా” అని అంటున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.