ఏపీ కాంగ్రెస్‌కు అభ్య‌ర్థి దొర‌కాడోచ్‌..

ఏపీ కాంగ్రెస్ పార్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే వారి కోసం.. ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు రోజుల నుంచి సీనియ‌ర్ల‌కు, పాత నాయ‌కుల‌కు కూడా పార్టీ నేత‌లుఫోన్లు చేసి ద‌ర‌ఖాస్తులు ఇస్తాం.. తీసుకోండి.. రండి పోటీ చేయండి.. అని పిలుపు నిస్తున్నారు. సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాలుగు రోజుల‌కు గాను వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు తొలి రెండు రోజుల్లో రెండు.. త‌ర్వాత రెండు రోజుల్లో ఒక‌టి మాత్ర‌మే వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీంతో కేవీపీ వంటివారు.. ఇక‌, అయిపోయింది.. ఏం పోటీ చేస్తాం..ఏం తిరుగుతాం..అని కాళ్లు ముడుచుకున్న‌వారికి కూడా ఫోన్లు చేస్తున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో దిగేందుకు కీల‌క‌మైన నాయ‌కుడు ముందుకు వ‌చ్చారు. నిన్న మొన్న‌టివ‌ర‌కు ఏం పోటీ చేస్తాం.. అని బ‌హిరంగంగానే అన్న ఆయ‌న ఇప్పుడు ద‌ర‌ఖాస్తు తీసుకున్నారు. అయితే..ఆయ‌న పెట్టుకున్న ఆప్ష‌న్ బాప‌ట్ల‌. దీంతో అంద‌రూ.. హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే.. పార్ల‌మెంటు సీట్ల‌కు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డ‌మే. ఆయ‌నే కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన శీలం.. గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. అయితే.. అప్ప‌ట్లోనూ ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి ఎన్నిక కాలేదు. 2004 నుంచి 2016 వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

గుంటూరు జిల్లా పెద‌నందిపాడు మండ‌లంలో జ‌న్మించిన జేసుదాసు శీలం(జేడీ శీలం), ద‌ళిత క్రిస్టియ‌న్‌. ప్ర‌స్తుతం ఆయ‌న బాప‌ట్ల ఎస్సీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఆయ‌న ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించారు. సొంత ఊరు కావ‌డం.. సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డం ఒక్కటే ఆయ‌న‌కు ప్ల‌స్‌గా క‌నిపిస్తున్నాయి. ఆర్థికంగా బ‌లంగానేఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఆయ‌న అప్పుల్లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంత ఏమేర‌కు ఖ‌ర్చు చేస్తారో చూడాలి.

ఇక‌, ప్ర‌స్తుతం ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు, ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. ఈయ‌న‌కే మ‌రోసారి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీ నుంచి చాలా మంది బ‌రిలో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, టీడీపీ ఎస్సీసెల్ నాయ‌కుడు రాజు వంటివారు.. ఈ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఎవ‌రికి ఈ టికెట్ ఇస్తార‌నేది చ‌ర్చ‌గా మారినా.. జ‌నసేన -టీడీపీ మిత్ర‌ప‌క్షం త‌ర‌ఫున దాదాపు ప‌నబాక ల‌క్ష్మికే జై కొట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.