నియోజకవర్గానికి రు. 10 కోట్లు..బంపరాఫర్

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాలకు తలా రు. 10 కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పూర్తిచేశారు. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటే రు. 1190 కోట్లను రాబోయే బడ్జెట్లో కేటాయించాలని కూడా రేవంత్ నిర్ణయించారు. గతంలో ఇంతమొత్తాన్ని కేటాయించలేదు. తొందరలోనే ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులను ప్రత్యేకంగా చూపించాలని రేవంత్ అధికారులను ఆదేశించారు.

ఈ మొత్తం కలెక్టర్ల దగ్గరే ఉంటుంది. కాకపోతే ఆ నిధులను ఎక్కడెక్కడ కేటాయించాలన్నది డిసైడ్ చేయాల్సింది మాత్రం ఎంఎల్ఏలు, మంత్రులే. ఈ మొత్తానికి ప్లానింగ్ విభాగం పరిపాలనా పరమైన అనుమతులను కూడా మంజూరుచేసింది. అంటే రు. 1190 కోట్ల కేటాయింపులపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నట్లు అర్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి రేవంత్ కూడా పాలనలో తన మార్కును ప్రజలకు చూపించాలని ఆతృతపడుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగం అభివృద్ధికి రు. 2 కోట్లు, తాగునీటి సౌకర్యం కల్పనకు రు. కోటి కేటాయించాలని మార్గదర్శకాల్లో ఉంది.

అలాగే కలెక్టరేట్ భవనాల నిర్వహణకు రు. 50 లక్షలు ఖర్చు చేయచ్చని ఉంది. మిగిలిన మొత్తాన్ని ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రుల సిఫారసు, ఆమోదంతో జిల్లాల కెలక్టర్లు ఖర్చు చేస్తారు. అంటే రోడ్లు వేయటం, మరమ్మత్తులు చేయించటం, విద్యుత్ లైన్లు వేయించటం తదితర ప్రజావసరాలకు ఖర్చు చేయాలని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ స్పష్టంగా గైడ్ లైన్స్ మంజూరుచేసింది.

ఏదేమైనా నియోజకవర్గం అభివృద్ధికి తలా రు. 10 కోట్లంటే చిన్న మొత్తమేమీ కాదు. దీన్ని సక్రమంగా ఉపయోగంచుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు కొన్నయినా వెంటనే తీరే అవకాశముంది. కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది మంత్రులు, ఎంఎల్ఏల విచక్షణ, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది మీదుంది. జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని నిధులు అందుతాయనే విషయాన్ని కూడా ప్లానింగ్ విభాగం ప్రకటించింది. బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు ఈ విషయాన్ని రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించాలని అనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.