రాష్ట్రాలను మ‌రింత అప్పులు పాలు చేస్తున్నారే!

ఔను.. వాస్త‌వం. ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టిన మ‌థ్యంత‌ర కేంద్ర బ‌డ్జెట్‌ను ప‌రిశీలిస్తే.. స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది ఇదే. ఎక్క‌డా ఏ రాష్ట్రానికీ ఊర‌ట‌నివ్వ‌ని బ‌డ్జెట్గా ఇది మిగిలింద‌న‌డంలో సందేహం లేదు. కేవలం రాష్ట్రా ల‌కు రుణాలు మాత్ర‌మే ఇస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప‌రోక్షంగా తెగేసి చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రాల‌న్నీ కూడా.. అప్పుల్లోనే ఉన్నాయి. ఇటీవ‌ల పార్ల‌మెంటులోనూ ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వివాదాలు లేని రాష్ట్రాలు ఉన్నాయేమో కానీ.. అప్పులు లేని రాష్ట్రాలు మాత్రం లేవ‌ని.. వ్యాఖ్యానించారు.

ఇప్పుడు మ‌రిన్ని అప్పుల దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌ను న‌డిపిస్తోంది. దీనికి పెట్టుకున్న ల‌క్ష్యం సంస్క‌ర‌ణ‌లు. తాము చేప‌ట్టే సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసే రాష్ట్రాల‌కు విరివిగా అప్పులు ఇవ్వ‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు. అయితే.. దీనికి వ‌డ్డీనిపూర్తిగా మిన‌హాయిస్తామ‌ని చెప్పారు. ఏమిటా సంస్క‌ర‌ణ‌లు అనేది సందేహం. ఇప్ప‌టి వ‌రకు అయితే.. వాట‌ర్ వినియోగానికి మీట‌ర్లు పెట్టాలి. చెత్త‌పై ప‌న్ను వేయాలి. ర‌హదారుల‌పై చెత్త బాధ్య‌త‌ల‌ను కూడా ప్ర‌జ‌ల‌పైనే మోపి వాహ‌న దారుల నుంచి వ‌సూలు చేయాలి.

ఇది కొంత చిత్రంగానూ విడ్డూరంగా అనిపిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు వాహ‌నాల‌కు.. రోడ్డు సెస్సు తీసుకుంటున్నారు. అంటే.. దీని అర్థం ర‌హ‌దారుల బాగు చేత‌కు సంబంధించి అయ్యే ఖ‌ర్చును తీసుకుంటున్నారు.కానీ, ఇక నుంచి రోడ్ల మ‌ధ్య‌లో పెంచే మొక్క‌ల సుంద‌రీక‌ర‌ణ‌, ర‌హ‌దారుల ప‌రిశుభ్ర‌త వంటి విష‌యాల‌ను కూడా.. చేర్చి..అద‌నంగా ప‌న్నులు వేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రాల బాధ్య‌తగా పేర్కొంటున్నారు. ఇది ఒక సంస్క‌ర‌ణ‌.

అదేవిధంగా విద్యుత్ వినియోగంలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త పేరుతో.. ప్ర‌తి ఇంటికీ.. విద్యుత్ మీట‌ర్‌ల‌ను మ‌రింత డిజిటలీక‌ర‌ణ చేయ‌నున్నారు. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు.. నాలుగు ఇళ్ల‌కు సంబంధించిన న‌ష్టం ఈ నాలుగు ఇళ్ల వారే భ‌రించాల్సి ఉంటుంది. ఇలా.. ఒక నూత‌న విధానం తీసుకువ‌స్తారు. త‌ద్వారా.. విద్యుత్ క‌ష్ట‌న‌ష్టాల‌ను ప్ర‌జ‌లే భ‌రించాల్సి ఉంటుంది. ఇది కూడా రాష్ట్రాల బాధ్య‌త‌. సో.. ఇవి అమ‌లు చేస్తే.. విరివిగా సొమ్ములు అప్పుల రూపంలో ఎలాంటి వ‌డ్డీలేకుండా ప్ర‌భుత్వాల‌కు 50 ఏళ్ల కాలానికి చెల్లిస్తారు. ఇదీ.. లోగుట్టు.. లోన్‌గుట్టు!