కోట్ల-కేఇ చేతులు కలిపారా ?

ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో డోన్ నుండి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు సమాచారం. కర్నూలు నుండి పోయిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన కోట్ల రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్నారట. అందుకనే డోన్ నియోజకర్గంపై మాత్రమే దృష్టి పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ ఇన్చార్జిగా చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సుబ్బారెడ్డి పెద్దగా యాక్టివ్ ఉండటంలేదు.

ఎందుకంటే సుబ్బారెడ్డిని కేఇ, కోట్ల కుటుంబాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టే. మొదట్లో డోన్ లో కేఇ ప్రతాప్ ఇన్చార్జిగా ఉండేవారు. తర్వాత ఆయన్ను తప్పించి ఆయన సోదరుడు ప్రభాకర్ ను నియమించారు. ఆ తర్వాత ఆయన్ను కూడా తప్పించి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటినుండే పార్టీలో గొడవలు మొదలయ్యాయి. సుబ్బారెడ్డిని తప్పించేందుకు కేఇ సోదరులు, కోట్ల ఏకమయ్యారు. నియోజకవర్గంలో ఇంత గొడవలు జరుగుతున్నా ఎందుకనో చంద్రబాబు పెద్దగా పట్టించుకోవటంలేదు.

మొన్న నంద్యాలలో రా..కదలిరా సభలో పాల్గొన్నపుడు వివిధ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశానికి సుబ్బారెడ్డితో పాటు బీసీ జనార్ధనరెడ్డి గైర్హాజరయ్యారు. వీళ్ళిద్దరు సమీక్షలో హాజరయ్యేందుకు లేదని కేఇ, కోట్ల స్పష్టంగా చెప్పారట. హాజరైతే గొడవలవుతాయన్న భయంతోనే వీళ్ళు దూరంగా ఉండిపోయారు. ఈ విషయం గమనించినా చంద్రబాబు కూడా పట్టించుకోకుండా మిగిలిన అన్నీ విషయాలు మాట్లాడి డోన్ నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోలేదు. దాంతో సుబ్బారెడ్డికి సమస్యలు మరింత పెరిగాయి.

ఈ నేపధ్యంలో డోన్ అభ్యర్ధిగా కోట్ల పోటీచేస్తే గెలుపుకు సహకరిస్తామని కేఇ సోదరులు కూడా హామీ ఇచ్చారని పార్టీలో టాక్ వినబడుతోంది. అంటే సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కేఇ, కోట్ల చేతులు కలిపినట్లు అర్ధమైపోతోంది. డోన్ నియోజకవర్గానికి సంబంధించిన విభేదాలు బహిరంగంగా జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. రెండు బలమైన కుటుంబాలు చేతులు కలిపినపుడు సుబ్బారెడ్డిని అభ్యర్ధిని ప్రకటించినా గెలుపు కష్టమే. ఎందుకంటే సుబ్బారెడ్డికి టికెటిస్తే ఓడగొడతామని బహిరంగంగానే ప్రతాప్, ప్రభాకర్ చాలాసార్లు హెచ్చరించారు. చంద్రబాబు ఎంత తొందరగా సమస్యపై దృష్టిపెడితే పార్టీకి అంత మంచిది.