షర్మిల స్లోగన్ జనానికి ఎక్కేసిందా?

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వ టార్గెట్ ఎలా ఉన్నా.. అనూహ్య మ‌లుపుతిరిగిన ఆమె ప్ర‌చారంలో ఇప్పుడు ఏకైక టార్గెట్ వైసీపీ. నిజానికి కాంగ్రెస్‌కు జ‌వ‌స త్వాలు ఇవ్వాల‌ని.. పుంజుకునేలా చేయాల‌న్న‌ది.. త‌న వ్యూహ‌మ‌ని పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన తొలిరోజు చెప్పారు. కానీ, ఇంత‌లోనే రెండో రోజు నుంచి ఆమె అన్న ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. ఏ రేంజ్ లో అంటే.. టీడీపీ అనుకూల మీడియాగా పేరొందిన‌.. ప‌త్రిక‌ల్లో ఏకంగా.. చంద్ర‌బాబు వార్త‌ల‌ను కూడా ప‌క్క‌కు నెట్టేసి. ష‌ర్మిల‌కు ప్రాధాన్యం ఇచ్చేంత‌గా.. బ్యాన‌ర్లు చేసేంత‌గా!!

అర్జునుడికి పిట్ట క‌న్ను మాత్ర‌మే క‌నిపించిన‌ట్టుగా ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌కు సీఎం జ‌గ‌న్ ఒక్కరే క‌నిపిస్తున్నారు. ఆయ‌న పాల‌న‌ను ఆమె తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం.. చేసిన విమ‌ర్శ‌లు ఒక ఎత్త‌యితే.. తాజాగా క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ష‌ర్మిల చేసిన ప్ర‌క‌ట‌న‌.. ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఇది క‌నుక జ‌నంలోకి సూటిగా వెళ్తే.. ఎవ‌రు ఔన‌న్నాకాద‌న్నా.. ఇబ్బంది త‌ప్ప‌ద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అదే.. “వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసిన‌ట్టే!” అనే నినాదం.

తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ.. ఇదే నినాదం .. అక్క‌డి బీఆర్ ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేసింద‌నే విశ్లేష‌ణ‌లు వున్నాయి. అక్క‌డ వాస్త‌వానికి మూడో సారి కూడా.. బీఆర్ ఎస్ పార్టీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. స‌ర్వేలు కూడా ఇదే చెప్పాయి. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ చీఫ్, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి.. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు నెల ముందు.. “బీఆర్ ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసిన‌ట్టే” అనే నినాదాన్ని ఎంచుకున్నారు. దీనిని ఊరూ వాడా ప్ర‌చారం చేశారు. ఫ‌లితంగా.. వ‌స్తాయ‌ని అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ..ఇత‌ర కార‌ణాల‌తోపాటు.. ఇది మ‌రింత తోడై.. బీఆర్ ఎస్‌పై ప్ర‌భావం చూపింది.

ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. ష‌ర్మిల తాజాగా తొలిసారి ఈ నినాదం ఎంచుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీతో కుమ్మ‌క్క‌య్య‌ర‌ని చెప్పిన ఆమె.. అనూహ్యంగా ఇలా వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ప‌డుతుంద‌ని చెప్ప‌డం.. గ‌మ‌నార్హం. అయితే.. ఇది కూడా ష‌ర్మిల విశ్వ‌స‌నీయ‌త‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ముందు ఆమెను ఆమె నిరూపించుకోవాల‌ని, అక్క‌డ పార్టీ తీసేసి ఇక్క‌డ‌కు ఎంద‌కు వ‌చ్చింది? అక్క‌డ న‌మ్ముకున్న‌వారిని ఏం చేసింది? అస‌లు ఆమె టార్గెట్ ఏంటి? అనే విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌గ‌లిగితే.. అప్పుడు ఇలాంటి నినాదాలు వ‌ర్కవుట్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.