రా.. అన్నా కండువా క‌ప్పుతా: డీఎల్‌కు ష‌ర్మిల ఆహ్వానం

“రా.. అన్నా కండువా క‌ప్పుతా!” అంటూ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ పాత‌త‌రం నేత‌, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ష‌ర్మిల‌.. తొలుత వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. అనంత‌రం.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే త‌న బాబాయి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌తోనూ ఆమె భేటీ అయ్యారు. అనంత‌రం.. కాజీపేటలోని డీఎల్‌ నివాసానికి వెళ్లిన ష‌ర్మిల ఆయ‌న‌తో దాదాపు రెండు గంట‌ల‌పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు.

డీఎల్ ఇంట్లోనే విందు చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌ని.. వ‌చ్చే ఎన్నికల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని ఆమె డీఎల్‌ను కోరారు. అదేవిధంగా పాత‌త‌రం నాయ‌కులు పార్టీకి ఆయువు ప‌ట్టు వంటివార‌ని, మీరు లేకుండా పార్టీ లేద‌ని చెప్పారు. అయిందేదో అయిపోయింది.. పార్టీలోకి వ‌చ్చేయండి. మ‌నం మ‌నం క‌లిసి పార్టీని అభివృద్ది చేసుకుందాం. అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. పార్టీలోకి వ‌స్తే.. మీరు కోరుకున్న సీటును తీసుకుందురు.. అని కూడా ఆయ‌నకు స‌ల‌హా ఇచ్చారు.

అయితే.. డీఎల్ మాత్రం ఆచి తూచి వ్య‌వ‌హ‌రించారు. త‌న కేడ‌ర్‌తో చ‌ర్చించిన త‌ర్వాత‌.. నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇరువురూ క‌లిసి మీడియాతో మాట్లాడుతూ.. ష‌ర్మిల త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసున‌ని.. ఆమె ఆహ్వానించ‌డం త‌ప్పుకాద‌ని డీఎల్ అన్నారు. అయితే.. త‌న కేడ‌ర్‌ను ఒక‌సారి క‌లిసి మాట్లాడి వారి నిర్ణ‌యం మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ద‌శ‌లోనే ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

కాగా, క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ఆయ‌న ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. దుగ్గిరెడ్డి ల‌క్ష్మీ ర‌వీంద్రారెడ్డి అయిన ఆయ‌న డీఎల్‌గా సుప‌రిచితులు. వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు స‌మాంతరంగా రాజ‌కీయాలు చేశారు. అధిష్టానంతో నే నేరుగా ప‌రిచ‌యాలు ఉన్న డీఎల్‌.. మంత్రి వ‌ర్గంలోనూ చోటు సంపాయించుకుని కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లోనూ ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసినా ఓడిపోయారు. త‌ర్వాత టీడీపీలోను.. వైసీపీలోనూ చేరాల‌ని ఆఫ‌ర్లు వ‌చ్చినా.. దూరంగా ఉన్నారు.