రోజాకు గిఫ్టా.. షాకా.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం ..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి ఆర్కే రోజా విష‌యంలో సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇక్క‌డ నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ రెండు సార్లు కూడా స్వ‌ల్ప‌మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ ద‌ఫా ఆమెకు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ వైసీపీలో వినిపిస్తోంది . దీంతో ఆమె కూడా మార్పున‌కు రెడీగానే ఉన్నారు. కొన్నాళ్ల కింద‌ట విజ‌య‌వాడ‌లో మాట్లాడుతూ.. త‌న‌ను మార్చినా ఇబ్బంది లేద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విష‌యం ఇలా చ‌ర్చ‌ల్లో ఉండ‌గా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త‌వారిని కేటాయిస్తూ.. పార్టీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది.

అయితే.. రోజా విష‌యాన్ని మాత్రం వైసీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. న‌గ‌రిపై ఎటూ తేల్చ‌లేదు. దీంతో న‌గ‌రి నుంచి తాను పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని రోజా అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే వైసీపీ అధిష్టానం..ఆమెకు షాక్ లాంటి గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఆమెను ఏకంగా జిల్లాలు మార్చి మ‌రీ తీసుకువ‌చ్చి.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌కాశం నేత‌ల‌కు తాజాగా తేల్చి చెప్పారు. శ‌నివారం మ‌ధ్యాహ్న‌మే ఈ విష‌యాన్ని ఆయ‌న అత్యంత ర‌హ‌స్యంగా వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

‘ఇక్క‌డ నుంచి రోజా పోటీ చేస్తారు. సీఎం జ‌గ‌న్ ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నారు. మీరంతా స‌హ‌క‌రించాలి’ అని విజ‌య‌సాయిరెడ్డి పార్టీ కీల‌క నేత‌, మాజీ మంత్రి బాలినేనికి చెప్పారు. ఊహించని ఈ ప‌రిణామంతో అంద‌రూ అవాక్క‌య్యారు. రోజా విష యంపై తాము చ‌ర్చించుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, అప్ప‌టి వ‌ర‌కు ఏమీ చెప్ప‌లేమ‌ని బాలినేని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే.. మ‌రో మాట‌గా.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్య‌వ‌హారం ఏం చేశార‌ని ఆయ‌న మ‌రోసారి ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్ .. కొన్నాళ్లుగా మాగుంట‌కు వ్య‌తిరేకంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు టికెట్ కూడా ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో త‌న వాడిగా ముద్ర వేసుకున్న మాగుంట‌కు టికెట్ ఎలాగైనా ఇప్పించాల‌ని బాలినేని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంత‌లో చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పేరును ఒంగోలు పార్ల‌మెంటు కు సూచించారు. అయితే.. ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తామ‌ని.. చెప్పినీ.. కీల‌క నేత‌లు మొహం చాటేశారు. పైగా.. త‌న‌కు అస‌లు ప‌రిచ‌య‌మే లేని జిల్లాలో పోటీ చేసినా.. ప్ర‌యోజనం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేసిన చెవిరెడ్డి వెన‌క్కి త‌గ్గారు. దీంతో మ‌ళ్లీ ఒంగోలు సీటు వ్య‌వ‌హారం పార్టీలో చ‌ర్చ‌కు రావ‌డం.. ఇదేస‌మ‌యంలో రోజా రెడ్డి అయితే.. బాగుంటుంద‌ని సీఎం జ‌గ‌న్ భావించ‌డంతో ఆమెను ఇక్క‌డ నుంచి నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై రెండురోజుల్లో ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.