పోటీకే భయపడుతున్నారా ?

బీఆర్ఎస్ లో నేతల మాటలు వింటుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులను ఫైనల్ చేయటంతో పాటు నియోజకవర్గాల్లో పరిస్ధితులను సమీక్షించేందుకు ఈమధ్యనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దాదాపు ఆరునియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాలామంది నేతలు ఎంపీగా పోటీచేసే విషయంలో ఆసక్తిచూపలేదని సమాచారం. అలాగే గెలుపు అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నట్లు చెప్పారని పార్టీవర్గాలు అంటున్నాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితమే దాదాపు రిపీటయ్యేట్లుగా ఉందని చాలామంది సీనియర్లు అంచనా వేస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంది కాని ప్రజా వ్యతిరేక నిర్ణయాలేవీ తీసుకోలేదు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని అమల్లోకి తెచ్చేసింది. మరో నాలుగింటిని కూడా అమల్లోకి తీసుకురావటానికి కసరత్తులు చేస్తోంది. పనిలోపనిగా కేసీయార్ పదేళ్ళ పాలనలోని అవతకవతకలు, అవినీతి, అరాచకాలను జనాల కళ్ళకు కట్టినట్లు రేవంత్ ప్రభుత్వం చూపిస్తోంది.

ప్రజాదర్బార్ నిర్వహించటం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రు. 10 లక్షలకు పెంచటం లాంటివి జనాలకు ఎంతో ఉపయోగకరమైనవి. అందుకనే జనాలు కూడా సంతోషంగానే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలకు సానుకూలంగా ఉన్న కారణంగా తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓట్లేసే అవకాశాలున్నాయని మెజారిటి కారుపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్ధితుల్లో ఎంపీలుగా పోటీచేసినా డబ్బులు వృధానే తప్ప గెలుపు కష్టమని అనుకేటున్నారట. అందుకనే పోటీకి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి, అవసరమైన నిధులు కూడా పార్టీయే సర్దుబాటు చేస్తే అప్పుడు పోటీచేయచ్చని మరికొందరు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నపుడే అతికష్టం మీద 9 సీట్లలో గెలిచిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 16 సీట్లలో ఎలా గెలుస్తుంది ? అనే చర్చ నేతల్లో పెరిగిపోతోంది. మరి కేసీయార్ జనాల్లోకి రావటం మొదలుపెట్టిన తర్వాత స్పందన ఎలాగుంటుందో చూడాలి.