టీడీపీ-జ‌న‌సేన విజ‌యం అన్ స్టాప‌బుల్‌: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సినీ డైలాగుల‌తో ఉర్రూత‌లూగించారు. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్కరించుకుని, ఆయ‌న జ‌న్మించిన గ‌డ్డ‌పై ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ ఏర్పాట్ల నుంచి నిర్వ‌హణ‌కు వ‌ర‌కు ఆద్యంత ఉద్రిక్త వాతావ‌ర‌ణంలోనే సాగింది. అయితే.. చివ‌రి మూడు గంట‌లు మాత్రం.. పోలీసులు న‌చ్చజెప్ప‌డంతో ఎమ్మెల్యే కొడాలి నాని వ‌ర్గం శాంతించింది. దీంతో స‌భ స‌జావుగా సాగిపోయింది. ఈ స‌భ‌లో తాజాగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన విజ‌యం అన్ స్టాప‌బుల్ అని బాల‌య్య డైలాగులు పేల్చారు.

వైసీపీ నిర్వాకంతో రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబంపైనా.. 4 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు ఆర్థిక భారం ప‌డిందని చంద్ర‌బాబు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా తీసుకువెళ్తామో చేసి చూపిస్తామ‌న్నారు. రాష్ట్రాన్ని ప్ర‌పంచానికి అనుసంధానం చేసి.. అంద‌రూ అబ్బుర ప‌డేలా చేస్తామ‌ని చెప్పారు. ‘జ‌గ‌న్ బిడ్డ కాదు.. కేన్స‌ర్ గ‌డ్డ‌’ అనే నినాదాన్ని స‌భ‌కు వ‌చ్చిన వారితో అనిపించారు. అదేవిధంగా జాబు కావాలంటే.. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం రావాల‌ని వ్యాఖ్యానించారు.

అర్హ‌త ఉన్న ప్ర‌తి యువ‌త‌కు ఉద్యోగాలు ఇప్పించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెన‌క్కి తీసుకువెళ్లింద‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న‌న్న బాణం అంటూ.. ఆయ‌న సోద‌రి, ప్ర‌స్తుత కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల గురించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె అన్న దెబ్బ‌కు ఎక్క‌డ‌కు వెళ్లిందో అంద‌రికీ తెలుసున‌ని, అదీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అంటే అని వ్యాఖ్యానిం చారు. కుటుంబాన్ని, ప్ర‌జ‌ల‌ను కూడా త‌న స్వార్థ రాజ‌కీయాలు, డ‌బ్బుల కోసం వాడుకుంటార‌ని విమ‌ర్శించారు.

ఒక‌ప్పుడు గుడివాడ అంటే.. ఆద‌ర్శంగా ఉండేద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు క్యాసినోల‌కు, గంజాయి జూదాల‌కు అడ్డాగా మారింద‌న్నారు. గ‌డ్డం గ్యాంగుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కూడా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంద‌న్నారు. “ప్రతి ఒక్కరికీ ఒక కీర్తి ఉంటుంది. ఒక‌ప్పుడు గుడివాడ పేరు కూడా దేశ‌వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు గుడివాడ అంటే బూతులు, దోపిడీ, పేకాటలు, కేసినోలకు కేంద్రంగా మారి.. దేశ‌వ్యాప్తంగా ఛీ కొట్టించుకుంటోంది” అని చంద్ర‌బాబు అన్నారు.