తండ్రి, కొడుకులు టీడీపీ నుండే పోటీచేస్తారా ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ ఎంపీ, ఆయన కొడుకు పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలు వైసీపీ  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చేఎన్నికల్లో టికెట్ అనుమానంగా ఉంది. మాగుంటకు ఎంపీగా జగన్ టికెట్ ఇస్తారని, ఇవ్వరని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాల మధ్య మాగుంట ఫ్యామిలీతో పాటు మద్దతుదారుల్లో టెన్షన్ పెరిగిపోతోందట.

అందుకనే వైసీపీకి తొందరలోనే మాగుంట రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. టీడీపీ తరపున ఎంపీగా మాగుంట, కావలి అసెంబ్లీ అభ్యర్ధిగా ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయబోతున్నట్లు జిల్లాలో ప్రచారం పెరిగిపోతోంది. వీళ్ళిద్దరికీ టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు కూడా సుముఖంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్నారు కాబట్టి మాగుంటకు టికెట్ ఇవ్వటానికి టీడీపీ వెనకాడకపోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళిద్దరు టీడీపీలో చేరితే చెరో జిల్లా నుండి పోటీచేయాల్సుంటుంది.

ఒంగోలు పార్లమెంటు ప్రకాశం జిల్లాలో ఉంటే కావలి అసెంబ్లీ నెల్లూరు జిల్లాలో ఉంది. వాస్తవానికి మాగుంట ఫ్యామిలిది నెల్లూరు జిల్లాయే. ఇప్పటికీ వాళ్ళ వ్యాపారాలు, బంధుత్వాలు, సొంత ఆస్తులు నెల్లూరులో కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబపరంగా రెండు జిల్లాల్లో పోటీ చేయడానికి వీళ్ళకి పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. అయితే కావలిలో సీనియర్ తమ్ముళ్ళు, క్యాడర్ ఎలా స్పందిస్తారన్నది చాలా కీలకం. ఒంగోలు ఎంపీగా మాగుంటకు చంద్రబాబు టికెటిస్తే ఇష్టమున్నా లేకపోయినా సీనియర్ తమ్ముళ్ళు, క్యాడర్ పనిచేస్తారనటంలో సందేహంలేదు.

అయితే కావలిలో మాగుంట రాఘవకు ఎంతమంది సీనియర్ తమ్ముళ్ళు, క్యాడర్ పనిచేస్తారన్నది అనుమానమే. ఇదే సమయంలో ఏకకాలంలో రెండుజిల్లాల్లో ఎంపీగా ఎంఎల్ఏగా తండ్రి, కొడుకులు పోటీచేయాలంటే వందల కోట్లరూపాయలు ఖర్చవుతుంది. మద్దతుదారులు కూడా రెండుగా విడిపోవాల్సుంటుంది. అప్పుడు ఇద్దరికీ నష్టం జరిగే అవకాశముంది. అదే ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే రాఘవ కూడా ఏదో అసెంబ్లీ నుండి పోటీచేస్తే అప్పుడు ఖర్చలూ కలిసొస్తాయి, మద్దతుదారులకూ ఇబ్బందులుండవు. మరీ విషయమై చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో చూడాలి.