ఏపీ మొత్తం మీదే హీటెక్కిన కాన్‌స్టెన్సీ… స‌మఉజ్జీల ఫైటింగ్‌…!

ఎన్నిక‌లు అన‌గానే స‌హ‌జంగానే పార్టీల మ‌ధ్య పోరు ఉంటుంది. ఇక‌, ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చే నాయ‌కు ల మ‌ధ్య కూడా ఆస‌క్తిక‌ర పోటీ నెల‌కొంటుంది. ఇది ఎక్క‌డైనా కామ‌న్‌. కానీ, రెండు అతి పెద్ద పార్టీల నుంచి రంగంలోకి దిగే నాయ‌కులుకూడా అతి పెద్ద నేత‌తైలే.. రాజ‌కీయంగా స‌మ ఉజ్జీలైతే.. ఆ పోరును ఊహించడం.. ఎవ‌రు గెలుస్తారు? అనేది అంచ‌నా వేయ‌డం అంత తేలిక‌కాదు. ఇప్పుడు ఇలాంటి పోరే.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాపు డామినేష‌న్ ఉన్న జ‌గ్గంపేట‌లో జ‌ర‌గ‌నుంది.

ఆర్థికంగా.. సామాజికంగా.. రాజ‌కీయంగా.. ప‌లుకుబ‌డి ప‌రంగా.. ఇలా అనేక కోణాల్లో ఎలా చూసుకున్నా.. ఇటు వైసీపీ అటు టీడీపీల నుంచి బ‌రిలో దిగ‌నున్న నాయ‌కుల ప‌రిస్థితి ఓ రేంజ్‌లో ఉంది. వారే.. వైసీపీ నుంచి  ఇప్ప‌టికే జ‌గ్గంపేట టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న మాజీ ఎంపీ.. తోట న‌ర‌సింహం. టీడీపీ నుంచి టికెట్ ఖాయ‌మ‌ని తెలుస్తున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ ఇద్ద‌రే ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

ఈ ఇద్ద‌రూ ఆషామాషీ నాయ‌కులు అయితే కాదు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి వ‌రుస విజ‌యా లు ద‌క్కించుకున్న నాయ‌కులుగా ఇటు తోట‌కు, అటు జ్యోతుల‌కు కూడా పేరుంది. పార్టీలు మారాయే త‌ప్ప‌.. నాయ‌కులు మాత్రం ఇప్పుడు మ‌రోసారి త‌ల‌ప‌డుతున్నారు. దీంతో జ‌గ్గంపేట రాజ‌కీయాలు హీటెక్కాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. 1994, 1999లో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి జ్యోతుల నెహ్రూ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు.,

త‌ర్వాత‌.. ఆయ‌న ప్రజారాజ్యం, వైసీపీల్లోకి చేరారు. ఆ స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున 2014లో విజ‌యం ద‌క్కించుకున్నారు నెహ్రూ. ఇక‌, తోట విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ టికెట్‌పై తోట గెలుపు గుర్రం ఎక్కారు. ఆ త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చి.. ఏకంగా కాకినాడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. ఇలా.. ఈ ఇద్ద‌రు నాయ‌కుల గ‌త చ‌రిత్ర చాలా పెద్ద‌గానే ఉంది. పైగా ఇద్ద‌రికీ స్థానిక సామాజిక వ‌ర్గంలో మంచి పేరు కూడా ఉంది. ఇక‌, ప‌లుకుబ‌డి, ఆర్థిక స్థాయి.. కేడ‌ర్ ప‌రంగా ఎలా చూసుకున్నా.. ఇద్ద‌రూ స‌మ ఉజ్జీలు. దీంతో జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ఎవరు గెలుస్తారో.. చూడాలి.