కేటీయార్ మెడకు చుట్టుకోవటం ఖాయమా ?

కేసీయార్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ అవినీతి మాజీ మంత్రి కేటీయార్ మెడకు చుట్టుకోబోతోందా ? ఇపుడిదే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గనుక సీరియస్ గా విచారణ చేయిస్తే కేటీయార్ తగులుకోవటం ఖాయమని అర్ధమవుతోంది. ఎందుకంటే ఫార్ముల ఈ రేస్ నిర్వహణకు కర్త, కర్మ, క్రియ అంతా కేటీయార్ అనే ఇపుడు బయటపడింది. అయితే ఈ రేస్ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.

నిజానికి అప్పట్లో కూడా రేస్ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవన్నది వాస్తవం. అయితే సొంత పట్టుదల కారణంగా అప్పట్లో మంత్రిగా కేటీఆర్ దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఆ ఏర్పాట్ల కోసం హెచ్ఎండీఏ రు. 55 కోట్లు ఖర్చు చేసింది. మొదటి విడత రేస్ పేరుతో నిర్వహణ సంస్ధ నెక్ట్స్ జెన్ సంస్ధ టికెట్లను అమ్ముకుని తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం నుండి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత రేస్ జరగలేదు. ఏర్పాట్లు చేసినందుకు 55 కోట్ల రూపాయలు ఖర్చయిపోయింది.

అంటే జరిగిన కోట్ల రూపాయలు అంతా వేస్టయినట్లే లెక్క. ఈ విషయం మీదే రేవంత్ రెడ్డి సమీక్ష జరిపినపుడు మొత్తం వ్యవహారాన్ని హెచ్ఎండీఏ ఇన్చార్జి అర్వింద్ కుమార్ నడిపించారని బయటపడింది. అందుకనే చీఫ్ సెక్రటరి వెంటనే అర్వింద్ కు షోకాజ్ నోటీసు జారీచేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి సమాధానం చెప్పాలని ఆదేశించారు. నోటీసుకు అర్వింద్ బదులిస్తు అప్పటి మంత్రి కేటీయార్ ఆదేశాల ప్రకారమే తాను ఏర్పాట్లు చేసినట్లు సమాధానమిచ్చారు. కేటీయార్ ఆదేశాలకు సంబంధించిన ఫైలును తీసుకురమ్మని చీఫ్ సెక్రటరీ అడిగితే అంతా నోటి మాట ద్వారానే కేటీయార్ ఆదేశాలిచ్చినట్లు అర్వింద్ చెప్పారట.

నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సీరియస్ అయి సిట్టింగ్ జడ్జి లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ చేయిస్తే ముందు అర్వింద్ తర్వాత కేటీయార్ తగులుకోవడం ఖాయం. ఎందుకంటే విచారణలో నిధుల వ్యయానికి సంబంధించి ఏమి జరిగిందనే విషయాలను అర్వింద్ వివరిస్తారు. అప్పుడు ఫైళ్ళని చూపమంటే అర్విండ్ చూపలేరు. అప్పుడు అనివార్యంగా కేటీయార్ ప్రస్తావన వస్తుంది. కేటీయార్ నోటిమాట ఆదేశాలతోనే అంతా చేసినట్లు అర్వింద్ చెబుతారు. దాన్నే రాతమూలకంగా ఇవ్వమని విచారణ కమిటి అడిగితే అప్పుడు కేటీయార్ కూడా తగులుకోవటం ఖాయం. మరి ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.