వైసీపీలో మరో వికెట్..ఎంపీ బాలశౌరి ఔట్?

ఏపీలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తూ జగన్ రెండు లిస్ట్ లు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో, ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి బాలశౌరి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలి రెండు జాబితాలలో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో, పార్టీని వీడే జాబితాలో వారి సంఖ్య ఎక్కువుంది. కానీ, అనూహ్యంగా టికెట్ రాని, రాదని నమ్మకం ఉన్న ఎంపీలు కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడడం జగన్ కు షాకింగ్ అనే చెప్పవచ్చు. 2019లో మచిలీపట్నం లోక్ సభ బరిలో నిలిచి 60 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. అయితే, జగన్ మార్క్ సమీకరణాల రీత్యా ఆయనకు ఈ సారి టికెట్ దక్కలేదు. దీంతో, ఆయన పార్టీ వీడేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి కొంతకాలంగా విభేదాలున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం జగన్‌ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. దీంతో, జనసేనలోకి వెళ్లాలని బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి…పవన్ ను కోరారట.

అతి త్వరలోనే టీడీపీ-జనసేన కూటమిలో బాలశౌరి చేరబోతున్నారనే టాక్ వస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలలో ఏదో ఒకటి ఇవ్వాల్సిందిగా పవన్ ను అంబటి రాయుడు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ రెండు నియోజకవర్గాలలో ఒకదానిని బాల శౌరి కూడా కోరుతున్నారట.