ష‌ర్మిల గురించి రాజారెడ్డి.. వైఎస్ ఆత్మ‌ల‌తో మాట్లాడా.. : పాల్

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన స‌మ‌యంలో ష‌ర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుంద‌ని అనుకున్నాన‌ని వ్యాఖ్యానించా రు. అస‌లు ఏముంద‌ని వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింద‌న్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌లేద‌ని, కాంగ్రెస్‌కు అమ్మేసింద‌ని పాల్ విమ‌ర్శించారు. “షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా?” అని పాల్ ప్ర‌శ్నించారు. తాను రాజారెడ్డి, వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మలతో మాట్లాడుతానని పాల్ చెప్పుకొచ్చారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని అన్నారు. “వారి ఆత్మ ఘోషిస్తోంది. ష‌ర్మిల ఇలా చేసినందుకు వారు బాధ‌ప‌డుతున్నారు. ష‌ర్మిల ప్ర‌జాశాంతి పార్టీలోకి వ‌చ్చి ఉంటే .. రాజ‌కీయంగా గుర్తింపు వ‌చ్చి ఉండేది” అని అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే ష‌ర్మిల కాంగ్రెస్ లో చేరార‌ని పాల్ విమ‌ర్శించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమ‌ర్శలు చేశారు. “కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డిస్కో డాన్స్ చేయాల్సి ఉంది. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదు. వైఎస్ పేరుని చార్జిషీట్‌లో సోనియా పెట్టించింది” అని పాల్ దుయ్య‌బ‌ట్టారు.

వైఎస్ కు, త‌న‌కు మధ్య గొడవలకు కారణం సోనియానేన‌ని పాల్ చెప్పారు. “జగన్ అంటే ఇష్టం లేని వారు నిర్భ‌యంగా ప్ర‌జాశాంతి పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో కానీ చేరాలి. కాంగ్రెస్‌లో ఎవరూ చేర‌ద్దు” అని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే, అది ఏ పార్టీ అనేది తాను వెల్ల‌డించ‌న‌ని పాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి గెలిపించాలని ఆయ‌న పిలుపునిచ్చారు.