ఎవరు కాంగ్రెస్ లో చేరినా ఊడేదేం లేదు: కొడాలి నాని

వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల చేరికపై వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తుడిచిపెట్టుకుని పోయిందని. భూస్థాపితం అయిందని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏ నాయకులను తెచ్చుకున్నా వాళ్లకు ఒనగూరేది ఏమీ లేదని, మాకు ఊడేది ఏమీ లేదని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా షర్మిలపై కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయని నాని ప్రశ్నించారు. పురందేశ్వరి బిజెపిలో చేరితే టిడిపి ఓట్లు చీలవా అని కొడాలి నాని ప్రశ్నించారు. ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ వైసీపీ ఓట్లు ఎలా చీలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో దిగజారడానికి మరో కారణం ఉందని నాని అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ముద్దాయిగా చేశారని నాని చెప్పారు. జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టారని, అందుకే ఏపీలో దిక్కుమాలిన స్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుందని విమర్శలు గుప్పించారు. ఈ కారణాలపై కాంగ్రెస్ హై కమాండ్ జగన్ కు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

కాగా, షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థులేనని, అలాగే చూస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్ కోసం తాము కష్టపడుతూనే ఉంటామని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబు, సోనియాగాంధీ నైజం అని పెద్దిరెడ్డి విమర్శించారు.

వైసీపీలో అవకాశం లేకే తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారని, ఆ తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల నిర్ణయంతో ఏపీకి గాని ఏపీ రాష్ట్రానికి, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. షర్మిలతో పాటు ఎవరు ఏ పార్టీలో చేరినా ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చిన ప్రజాశీస్సులు జగన్ కే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.