బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదేమిటంటే  కేసీయార్, బీఆర్ఎస్ పనైపోయిందని. ఇదే విషయాన్ని కమలనాదులంతా ఉద్దేశ్యపూర్వకంగా పదేపదే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యమాత్రమే ఉంటుందని కావాలనే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీయార్ పనైపోయిందని అవసరం లేకపోయినా ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో పాటు 16 నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో నిలవటమే.

కాంగ్రెస్ గెలిచిన 16 నియోజకవర్గాల్లో బీజేపీ సెకండ్ ప్లేసులో నిలిస్తే బీఆర్ఎస్ మూడోప్లేసులో నిలిచిందని కరీంనగర్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని జనాలందరు గుర్తించినట్లు బండి చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని జనాలు అనుకున్నదే నిజమైతే మరి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 39 నియోజకవర్గాల్లో ఎలా గెలిచింది ? అంటే మాత్రం సమాధానం చెప్పటంలేదు.

కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లలో బీజేపీ గెలిచుంటే బండి చెప్పింది నిజమే అనుకునే అవకాశముంది. కానీ అలా జరగలేదన్న విషయాన్ని బండి ఉద్దేశ్యపూర్వకంగానే మరుగున పడేస్తున్నారు. మొన్ననే జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయుండచ్చు. అయితే ఇదే ఎన్నికల్లో బీజేపీ అసలు సోదిలోకి కూడా కనబడలేదు. కాబట్టి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే కానీ బీజేపీ ఎంతమాత్రం కాదన్న విషయం అందరికీ తెలుసు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఏకైక కారణంగానే తెలంగాణాలో బీజేపీ రెచ్చిపోతోందని అందరికీ అర్ధమైంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లలో గెలుపును కమలనాదులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారు. అయితే అమిత్ చెప్పినంత మాత్రాన బీజేపీ గెలవదు. జనాలు ఓట్లేస్తేనే కమలంపార్టీ గెలుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మరి చివరకు ఏమవుతుందో తెలీదు కానీ కేసీయార్ మీద బీజేపీ మాత్రం మైండ్ గేమ్ ఆడేస్తోంది.