వైసీపీ ఓటు బ్యాంకుపై భారీ వ్యూహం..

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఒక ప్ర‌త్యేక మైన ఓటు బ్యాంకు ఉంది. అదే.. క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు. గ‌త 2014 ఎన్నిక‌ల్లోనూ, 2019 ఎన్నిక‌ల్లోనూ వీరు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. 2014లో పార్టీ అధికారంలోకి రాక‌పోయినా.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా క్రిస్టియ‌న్‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, 2019లో అయితే..ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క కొండ‌పి మిన‌హా.. అన్నింటి లోనూ క్లీన్ స్వీప్ చేసేసింది.

అయితే.. ఇంత‌టి బ‌ల‌మైన క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు.. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకం టే.. ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు వైఎస్‌త‌న‌య ష‌ర్మిల‌కు అప్ప‌గిస్తార‌నేప్ర‌చారం ఊపందుకుంది. దీంతో ఎస్సీ ఓటు బ్యాంకు ప్ర‌భావితం అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌తో విభేదిస్తున్న ష‌ర్మిల భ‌ర్త‌, సీఎం జ‌గ‌న్‌కు సొంత బావ బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఈ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం కూడా ఉంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలను వైసీపీ కంచుకోటలుగా భావిస్తోంది. షర్మిల రాకతో ఆ కోటకు బీటలు వారడం ఖాయమని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కు క్రిస్టియన్లలో మంచి ఆదరణ ఉంది. ఆయన గతంలోనూ ఏపీలోని పలు పట్టణాల్లో క్రైస్తవ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వర్గాన్ని పూర్తిస్థాయిలో తమ ఓటు బ్యాంకుగా వైసీపీ భావిస్తున్న నేప‌థ్యంలో షర్మిల కాంగ్రెస్‌లోకి చేరితే ప‌రిణామాలు మ‌రింత మారే అవ‌కాశం ఉండ‌నుంది.

బ్రదర్‌ అనిల్‌ ప్రభావం కూడా ఎస్సీ ల ఓటు బ్యాంకుపై ఉంటుంద‌ని.. అప్పుడు వైసీపీ కీల‌క ఓటు బ్యాం కు క‌దిలిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని ఒక అంచ‌నా వేస్తున్నారు. మ‌రి రాజ‌కీయాల్లో భావోద్వేగాలు.. సెంటిమెంట్ల‌కు ప్ర‌ధాన స్థానం ఉండ‌డంతో బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్ ఆయా ఓటు బ్యాంకును వైసీపీకి దూరం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.