రాముడు, పెట్రోలు ధరలు!

శ్రీరాముడి పేరుతో ఎన్నికల మాయ చేస్తున్న మోడీ… తాజాగా పెట్రోలు ధరలతో మరో మాయ మొదలుపెట్టారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రప్రభుత్వం బారీగా తగ్గించబోతోందని. ధరలు తగ్గించాలని చమురు కంపెనీలు మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపిందట. మంత్రిత్వశాఖ కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించి, కసరత్తు చేసి నరేంద్రమోడీకి ధరల తగ్గింపుపై సిఫారసు చేసినట్లు ఢిల్లీ నుండే వార్తలు  వినబడుతున్నాయి. పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గించాలని, డీజల్ ధరలు  8 రూపాయలు తగ్గించాలని మంత్రిత్వశాఖ  ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

చమురు కంపెనీలు,మంత్రిత్వ శాఖ నుండి అందిన ప్రతిపాదనలు, సిఫారసులకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు. న్యూఇయర్ గిఫ్ట్ కింద ఒకటి రెండు రోజుల్లోనే ధరల  తగ్గింపుపై మోడీ ప్రకటన చేయబోతున్నారని విపరీతంగా  ప్రచారమవుతోంది. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే ఇది ఫక్తు రాజకీయ తాయిలమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే పెట్రోల్, డీజల్ ధరలను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 55 రూపాయలు పెంచింది. ఏ దేశంలో అయినా పెట్రోలో, డీజల్ ధరలు అంతర్జాతీయస్ధాయిలో క్రూడాయిల్ బ్యారెల్ ధర ఆధారంగానే నిర్ణయమవుతుంది.

ఆ రకంగా చూసుకుంటే మనదేశంలో లీటర్ పెట్రోల్, డీజల్ ధరలు  సుమారు 50 లేదా 60 రూపాయలకే దొరకాలి. కానీ రూ 100 దాటుతోందంటేనే మోడీ ప్రభుత్వం జనాలను ఏ స్ధాయిలో దోచేస్తోందో  అర్ధమవుతోంది. అంతర్జాతీయస్ధాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగితే  వెంటనే పెట్రోల్, డీజల్ ధరలను కంపెనీలు పెంచేస్తున్నాయి. అదే క్రూడాయిల్ ధరలు తగ్గినపుడు మాత్రం పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించటంలేదు.

ఇపుడు సడెన్ గా ధరలు తగ్గబోతున్నాయనే ప్రచారం వెనుక రాబోయే ఎన్నికలని అర్ధమవుతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలవటం మోడీతో పాటు బీజేపీకి చాలా అవసరం. ఎన్డీయేనే గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా బలం పుంజుకుంటున్నాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ప్రతిపక్షాలు ఎంత పుంజుకుంటే బీజేపీకి అంతనష్టం. అందుకనే పెట్రోల్, డీజల్ ధరల తగ్గింపు తాయిలాలను జనాలకు చూపించి ఓట్లేయించుకోవాలన్నది మోడీ ఆలోచనగా స్పష్టమవుతోంది. ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ధరలను రెట్టింపు పెంచటం మోడీకి అలవాటుగా మారిపోయింది.